సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదం తర్వాత ఆయనకు మామయ్య గాస్టార్‌ చిరంజీవి నుంచి ఓ సందేశం వచ్చిందంట. ఆ సందేశంలో ఏముందు బయటపెట్టారు సాయిధరమ్‌ తేజ్‌.

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బైక్‌పై ప్రయాణం చేస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కోమాలోకి వెళ్లి కోలుకున్నారు. ఇప్పుడు తిరిగి మామూలు మనిషి అయ్యారు. హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన `విరూపాక్ష` చిత్రం శుక్రవారం(ఏప్రిల్‌ 21న) విడుదల కానుంది. ఈసినిమాకి సుకుమార్‌ స్క్రీన్‌ప్లే అందించగా, కార్తీక్‌ దండు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయిధరమ్‌తేజ్‌ మీడియాతో ముచ్చటిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అందులో భాగంగా తన యాక్సిడెంట్ తర్వాత చిరంజీవి స్పందన గురించి సాయిధరమ్‌ తేజ్‌ చెబుతూ, ప్రమాదం జరిగిన తర్వాత మామయ్య(చిరంజీవి) నుంచి ఓ సందేశం వచ్చింది. `ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి` అనే సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రాసిన లైన్‌ని తనకు పంపించారట. అది తనని ఎంతో ఇన్‌స్పైర్‌ చేసిందని, తనలో కసిని, తాను మళ్లీ మామూలు మనిషి అయ్యేందుకు ఎంతో దోహదపడిందన్నారు సాయిధరమ్‌ తేజ్‌. జీవితం అంటే కష్టాలు వస్తాయి, వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లడమే జీవితం. కష్టాలను చూసి బాధపడకూడదన్నారు తేజ్‌. 

`విరూపాక్ష` సినిమా అమ్మకోసం చేశామని, అమ్మకి అంకితమంటూ సాయిధరమ్‌తేజ్‌ పదే పదే ఈవెంట్లలో వెల్లడించారు. దీనిపై ఆయన స్పందిస్తూ, ప్రమాదం తర్వాత మళ్లీ నేను సినిమాలు చేస్తానా లేదా అనే సందేహాలు అందరికి కలిగాయి. అనుమానాలు వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి అమ్మ తనకు మళ్లీ అన్నీ నేర్పించింది. 36ఏళ్ల తనకు అమ్మ మళ్లీ అన్నీ తానై నేర్పించిందని, మాటలు నేర్పించిందని వెల్లడించారు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా అమ్మ మనకోసం ఏమైనా చేస్తుంది. అలాంటి మనం ఏం చేసినా అమ్మ కోసమే చేయాలి, పేరెంట్స్, గురువుల కోసమే చేయాలని చెప్పారు సాయిధరమ్‌ తేజ్‌. 

ప్రమాదం జరిగిన తర్వాత తాను మళ్లీ నటిస్తానా? లేదా అనుకునే సమయంలో సినిమా షూటింగ్‌కి ముందు కొన్ని రోజులు వర్క్ షాప్‌ చేశారట. వర్క్ షాప్‌లో తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని, మొదట తన పరిస్థితి ఏం బాగాలేదని, టీమ్‌ అడ్జస్ట్ అయి మరీ ఓపికతో ట్రైన్‌ చేశారట. డైలాగ్‌లు పలకడం, మూవ్‌మెంట్స్ నుంచి అన్నీ ప్రాక్టీస్‌ చేశారట. వర్క్ షాప్‌లో టీమ్‌కి నమ్మకం ఏర్పడిన తర్వాత షూటింగ్‌ ప్రారంభించారట. 

`విరూపాక్ష` గురించి చెబుతూ, వరుస హత్యల నేపథ్యంలో సాగే మిస్టరీ హర్రర్‌ థ్రిల్లర్‌ సినిమా అని, ఫాంటసీ ఎలిమెంట్లతో సినిమా సాగుతుందన్నారు. `80, 90వ దశకంలో ఈ కథ ఉంటుంది. వరుసగా జరిగే మిస్టరీ డెత్‌లు ఏంటి? ఊరి మీద చేతబడి చేయించారా? చేస్తే ఎవరు చేసి ఉంటారు? అనే దాని చుట్టూ జరిగే కథ ఇది. విరూపాక్ష అంటే రూపం లేని కన్ను. అంటే శివుడి మూడో కన్ను. రూపం లేని దాంతో ఈ సినిమాలో పోరాటం చేస్తాం. అందుకే `విరూపాక్ష` అని టైటిల్ పెట్టాం` అని చెప్పారు సాయిధరమ్‌ తేజ్‌. 

తన కెరీర్‌లో ఇలాంటి సినిమా చేయడం మొదటిసారి అని, దీంతో కొంత కష్టంగా, ఛాలెంజింగ్‌గా అనిపించిందన్నారు. సినిమా పెద్ద హిట్‌ మూవీ అవుతుందని నమ్ముతున్నట్టు తెలిపారు. ఈ సినిమా ఈ నెల 21న తెలుగులోనే రిలీజ్‌ అవుతుందని, ఆ తర్వాత గ్యాప్‌తో మిగిలిన భాషల్లో రిలీజ్‌ అవుతుందన్నారు. ఈ సినిమాని ముందుగా పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ టెక్నీకల్‌గా ఎదురైన సమస్యలతో ఈ నెల 21న కేవలం తెలుగులోనే రిలీజ్‌ చేస్తున్నామని చెప్పారు సాయిధరమ్‌ తేజ్‌. సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్ పతాకాలపై బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.