`మోసగాళ్లు`కు బ్రేక్.. షూటింగ్ నిలిపి వేసిన యంగ్ హీరో
కరోనా ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్ విధించటంతో మంచు విష్ణు కూడా తన తాజా చిత్రం మోసగాళ్లు షూటింగ్ వాయిదా వేసినట్టుగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని మంచు విష్ణు ఆకాంక్షించారు.
మంచు విష్ణు ప్రస్తుతం 'మోసగాళ్లు' అనే హాలీవుడ్-ఇండియన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం విష్ణు, కూకట్పల్లిలో సుమారు రూ. 3.5 కోట్ల వ్యయంతో ఒక భారీ ఐటీ ఆఫీస్ సెట్ను నిర్మించాడు. ఇప్పుడక్కడ ఎడారి వాతావరణం కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంతో రూపొందుతున్న 'మోసగాళ్లు' సినిమా షూటింగ్ 2019 మొదట్లో ఆరంభమైంది. లాస్ ఏంజెల్స్, హైదరాబాద్ ప్రాంతాల మధ్య వేగంగా చిత్రీకరణ జరిగింది. అయితే కరోనా ప్రభావం కారణంగా లాక్ డౌన్ ప్రకటించటంతో సినిమా చిత్రీకరణ నిలిపివేశారు.
విష్ణుతో పాటు కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి పాల్గొనగా ప్రధాన సన్నివేశాలు, క్లైమాక్స్, యాక్షన్ సీన్లు దాదాపు పూర్తయ్యాయి. అయితే, చిత్రానికి అతి కీలకమైన ఐటీ ఆఫీస్ సీన్లు.. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. 'మోసగాళ్లు' చిత్రీకరణ ఆగిపోయిన విషయం చిత్ర బృందం ధ్రువీకరిస్తూ, ప్రతి యూనిట్ మెంబర్ క్షేమం దృష్ట్యా చిత్రీకరణ నిలిపివేశామనీ, ప్రస్తుతం దేశం ఎదుర్కొటున్న విపత్కర పరిస్థితి మెరుగై, సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక చిత్రీకరణ కొనసాగిస్తామని వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని మంచు విష్ణు ఆకాంక్షించారు. ప్రజలందరూ ప్రభుత్వ సలహాలు, సూచనలను కచ్చితంగా పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. అందరూ సామాజిక దూరం పాటిస్తూ, సెల్ఫ్ క్వారంటైన్ను అమలు చేయాలని ఆయన కోరారు.
ఇటీవల 'మోసగాళ్లు' చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్లుక్ పోస్టర్లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ఆ పోస్టర్లతో అర్జున్గా విష్ణు, అను పాత్రలో కాజల్ అగర్వాల్, ఏసీపీ కుమార్గా సునీల్ శెట్టి పాత్రలను పరిచయం చేశారు. హాలీవుడ్కు చెందిన జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్న 'మోసగాళ్లు' సినిమా ఈ ఏడాది వేసవికే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.