Asianet News TeluguAsianet News Telugu

పాత బంగారం: 1942లో సూపర్ హిట్టైన సినిమా పబ్లిసిటీ ట్రిక్

జనాలని రప్పించటం కోసం అనేక పబ్లిసిటీ ట్రిక్స్ వాడటం సినిమా నిర్మాతలు చేసే పనే. అయితే సినిమా ప్రారంభం రోజుల్లో అవి మరీ ఎక్కువ ఉండేవి. రిపీట్ ఆడియన్స్ కోసం, కొత్తవాళ్లను ఎట్రాక్ట్ చేయటం కోసం రకరకాల ఆలోచనలు చేసేవారు. 

Unbelievable Rs. 10.000 prize song contest for Nandhanar
Author
Hyderabad, First Published Nov 11, 2019, 8:09 AM IST

జనాలని రప్పించటం కోసం అనేక పబ్లిసిటీ ట్రిక్స్ వాడటం సినిమా నిర్మాతలు చేసే పనే. అయితే సినిమా ప్రారంభం రోజుల్లో అవి మరీ ఎక్కువ ఉండేవి. రిపీట్ ఆడియన్స్ కోసం, కొత్తవాళ్లను ఎట్రాక్ట్ చేయటం కోసం రకరకాల ఆలోచనలు చేసేవారు. అలాంటి ఓ పబ్లిసిటీ ప్రయోగం 1942లో రిలీజైన భక్త నందనార్ అనే తమిళ సినిమా కోసం చేస్తే అది బాగా సక్సెస్ అయ్యి..సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పటికీ ఆ తరానికి సంభందించిన  సినిమాల ప్రస్దావన వస్తే ఈ విషయం గురించి మాట్లాడతారు. అదేమిటంటే...

 1942 లో జెమిని పతాకం పై వాసన్ మురుగదాస్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం భక్త నందనార్.అది నందనార్ అనే దళిత భక్తుని కథ. ఈ కథ ఆధారంగా తమిళంలో అప్పటికే మూడు చిత్రాలు నిర్మించారు. 1923 (మూకీ), 1930 (టాకీ), 1935 (టాకీ) లోనూ ఈ కథతో సినిమాలు వచ్చాయి. దాంతో తమ సినిమాకు ప్రత్యేకమైన ప్రేక్షకాదరణ ఉండాలంటే..ఏం చేయాలని నిర్మాత వాసన్ ఆలోచించారు. దాంతో ఆయన పబ్లిసిటీ పరంగా ఓ ఆలోచన వచ్చింది. అప్పటిదాకా సౌత్ లో ఎవరూ చేయని  ప్రయోగం అది.

ఈ సినిమాలోని 31 పాటల్లో ఉత్తమమైన మూడు పాటలు ఎంపిక చేసి ప్రేక్షకులు తమకు పంపితే ప్రైజ్ మనీ ఉంటుందని ప్రకటనచేసారు. ఆ ప్రైజ్ మనీ కూడా భారీగానే ఉంది. అందుకు సినిమా చూసిన  ప్రేక్షకుడు చేయాల్సిందల్లా... సినిమా చూసి...థియోటర్ దగ్గర ఇచ్చే పాటలు లిస్ట్ ఉన్న  ఓ షీట్ లో  తమకు నచ్చిన మూడు పాటలకు టిక్ కొట్టాలి. ఆ తర్వాత ఆ షీట్ కు,  సినిమా టికెట్ జతపరస్తూ అక్కడే థియోటర్ దగ్గర పెట్టిన భాక్స్ లో వేయాలి.

వాసన్ మొదటే మూడు బెస్ట్ సాంగ్స్ ని ఎంపిక చేసి,దాన్ని ఓ సీలెడ్ ఎన్వలెప్ కవర్ లో పెట్టి ఇండియన్ బ్యాంక్ లో ఉంచారు. ఆ విషయాన్ని  ఈ ప్రైజ్ స్కీమ్ ఎనౌన్స్ చేసేటప్పుడే చేసారు. ప్రైజ్ మనీ 10 వేల రూపాయలు. ఆ రోజుల్లో పదివేలు అంటే సామాన్యమైన విషయం కాదు. దాంతో జనం విపరీతంగా ఎగబడ్డారు. విపరీతంగా ఎంట్రీలు వచ్చాయి.దాంతో సినీ పెద్దల సమక్షంలో , మీడియాని పిలిచి లాటరీ నిర్వహించారు. చివరికి 20 మందికి ఈ బహుమతి మొత్తాన్ని సమంగా పంచారు.

అలాగే ఈ చిత్రం పాటల రికార్డులు చిత్ర శతదినోత్సవం దాకా మార్కెట్లోకి విడుదల కానివ్వలేదు. దాంతో దండపాణి దేశికర్ పాటలు మళ్ళీ మళ్ళీ వినాలని ప్రేక్షకులు పదేపదే చిత్రాన్ని చూసారు. ఆ విధంగా తన సినిమాని మార్కెట్ చేసారు వాసన్.

ఇక ఈ చిత్రంలో ప్రఖ్యాత విద్వాంసుడు దండపాణి దేశికర్ నందుని పాత్ర పోషించారు. రంజన్ పరమశివుని పాత్ర ధరించారు. ఎమ్ టి పార్ధసారధి, సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించగా, వాగ్గేయకారుడు పాపనాశం శివన్, విద్వాంసుడు కొత్తమంగళం సుబ్బు సాహిత్యం సమకూర్చారు. అలాగే సుబ్బు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కూడా పోషించారు.

అంతకు ముందు 1935 లో వచ్చిన నందనార్ చిత్రంలో నందుని పాత్రను KB సుందరాంబాళ్ పోషించారు. మాణిక్ లాల్ టాండన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణానికి 3 లక్షల రూపాయలు ఖర్చయితే సుందరాంబాళ్ కు లక్ష రూపాయల పారితోషికం ఇచ్చారు! అది ఆ రోజుల్లో చాలా పెద్ద విషయం. అందరూ ఆశ్చర్యంగా చెప్పుకునేవారు. ఈ సినిమాలో  భూస్వామి పాత్రను మరో ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు మహారాజపురం విశ్వనాథ అయ్యర్ పోషించారు. ఈ చిత్రానికిఎల్లిస్ ఆర్ డంగన్ తొలిసారి ఛాయాగ్రహణం నిర్వహించారు.

ఆ తర్వాత 1959 లో అక్కినేని నటించిన జయభేరి చిత్రంలో "నందుని చరితము వినుమా" అనే పాటను ఈ కథ ఆధారం చేసుకుని పెట్టారు. ఆ  శ్రీశ్రీ గీతం వినని వారు ఉండరు. "శివ భక్తులలో అధికులు, అధములు అనే వ్యత్యాసం లేదు. ఈ భేదాలు మనిషి దృష్టిలో తప్ప భగవంతుని చరాచర సృష్టిలో లేవు" అని ప్రబోధించిన పరమ శివ భక్తుడు "భక్త నందనార్" హృదయ నివేదన ఈ పాట. ఈ పాట కూడా పెద్ద హిట్.

Follow Us:
Download App:
  • android
  • ios