ప్రాణ స్నేహితుడిని కోల్పోయిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్
సుకుమార్ ప్రాణ స్నేహితుడు వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ గుండెపోటుతో మరణించారు. శనివారం మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతితో దర్శకుడు సుకుమార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
తనకి అత్యంత సన్నిహితుడు, ప్రాణ స్నేహితుడు వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ కోల్పోయారు. ఈ షాకింగ్ న్యూస్ విన్న సుకుమార్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్, సుకుమార్కు స్నేహితుడు మాత్రమే కాదు, కొంతకాలంగా ఆయనే సుకుమార్ కు మేనేజర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. అంతేకాదు `అమరం అఖిలం ప్రేమ` అనే చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. సుకుమార్కి సొంత కుటుంబ సభ్యులతో పాటు ప్రసాద్ కూడా అంతే సన్నిహితుడు.
శనివారం మధ్యాహ్నం ఆయన తీవ్ర గుండె పోటుతో మరణించారు. ఎప్పుడు డిజప్పాయింట్కి లోనైనా.. తన మిత్రుడు ప్రసాద్తో మాట్లాడితే మళ్లీ ఎనర్జీ వచ్చేదని, అంతగా తన లైఫ్లో ఆయన కీలక పాత్ర పోషించారని సుకుమార్ పలు మార్లు వెల్లడించారు. ఆయన మరణం తనకి తీరని లోటని, భవిష్యత్తులో ఎవ్వరూ ప్రసాద్ ప్లేస్ని రీప్లేస్ చేయలేరన్నారు సుకుమార్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇక సినిమాల విషయానికి వస్తే రంగస్థలం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్నా సుకుమార్ ఇటీవల అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమాను ప్రారంభించాడు. ఆ సినిమా ఇటీవల సెట్స్ మీదకు వచ్చింది. ఈ సినిమాతో పాటు పలు చిత్రాలకు నిర్మాతగా కథ రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా కూడా వ్యవహరిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఉప్పెన సినిమాను సుకుమారే నిర్మిస్తున్నాడు.