సాయి ధరమ్ తేజ్: చిరంజీవికి చంద్రబాబు ఫోన్
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేశారు. హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. త్వరగా సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని ఆయన ఆశించారు.
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
కాగా, సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన బులిటెన్లో తెలిపాయి. శుక్రవారం రాత్రి స్పోర్ట్స్ బైక్పై ప్రయాణిస్తుండగా సాయిధరమ్ తేజ్ ప్రమాదవశాత్తూ కిందపడి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. హైదరాబాదులోని తీగల వంతెన-ఐకియా రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
మెడికవర్లో ప్రాథమిక చికిత్స అనంతరం సాయి ధరమ్ తేజ్ ను అపోలో ఆసుపత్రికి తరలించారు. సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన్ను పరామర్శించేందుకు ఆస్పత్రికి వస్తున్నారు.
తాజాగా ప్రముఖ నటుడు మోహన్ బాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైదుల్ని అడిగి తెలుసుకున్నారు. రెండు మూడు రోజుల్లో సాయిధరమ్ తేజ్ ఇంటికి తిరిగి వస్తాడని ఆకాంక్షించారు. ఐసీయూలో ఉన్న సాయిధరమ్ తేజ్ని మోహన్బాబుతోపాటు ఆయన కుమార్తె మంచు లక్ష్మీ చూసేందుకు వెళ్లారు.