మోడీకి పూరి జగన్నాధ్ లేఖ.. ముందు ఆ పని చేయండి అంటూ..
భారత ప్రధాని నరేంద్ర మోడీకి పూరి జగన్నాధ్ బహిరంగ లేఖ రాశారు. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మోడీకి లేఖ రాయడం ఏంటి అనే ఆశ్చర్యం కలగొచ్చు. దేశం మొత్తం ప్లాస్టిక్ నిషేధంపై జరుగుతున్న చర్చపై పూరి మోడీకి కొన్ని సూచనలు చేశారు.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో కవర్లు లాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దీనిపై కేంద్రం ఆలోచనతో డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ విభేదించారు. నేరుగా ప్రధానికి కొన్ని సూచనలు చేశారు.
మిగిలిన సమస్యలతో పోల్చుకుంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంత పెద్ద సమస్య కాదని పూరి జగన్నాధ్ అన్నారు. ఇప్పుడున్న ప్లాస్టిక్ ని సరిగా వినియోగించుకుంటే సరిపోతుంది. ఉన్నపళంగా ప్లాస్టిక్ ని నిషేధిస్తే ఎకో ఫ్రెండ్లీ బ్యాగులు ఉపయోగించాలి. వాటిని ఉత్పత్తి చేయాలంటే ఎన్ని చెట్లు నాశనం అవుతాయి అని పూరి ప్రశ్నించారు.
ప్లాస్టిక్ వాడకం కన్నావాహనాల నుంచి వచ్చే కాలుష్యమే అత్యంత ప్రమాదకరం అని పూరి జగన్నాధ్ అన్నారు. ముందు దీనిని నివారించే చర్యలు చేపట్టాలి. ప్లాస్టిక్ వాడకంపై కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడున్న ప్లాస్టిక్ నే పునరుత్పత్తి చేయాలి. అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లు కోసం ప్రజలకు ప్రభుత్వం కొంత డబ్బు ఇవ్వాలి.
దానివల్ల ప్లాస్టిక్ కవర్లని ప్రజలు జాగ్రత్తగా వినియోగించుకుంటారు. అది కూడా డబ్బే అని ఫీల్ అవుతారు. ఎక్కడపడితే అక్కడ పడేయరు అని పూరి అభిప్రాయపడ్డారు. అదే విధంగా ప్లాస్టిక్ ని క్లీన్ చేసే యూనిట్స్ ని ప్రభుత్వం ప్రారంభించాలి అని పూరి జగన్నాధ్ సూచించారు.