ఇండస్ట్రీ టాక్: పవన్ రెమ్యునరేషన్ 50 కోట్లు.. క్రిష్ డైరెక్షన్ లో రీఎంట్రీ!
జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటూనే తిరిగి సినిమాల్లో నటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ త్వరలో క్రిష్ దర్శత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జనసేనాని పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఇటీవల రాంచరణ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. కళ్యాణ్ బాబాయ్ కథలు వింటున్నారు కానీ ఇంకా దేనిని ఖరారు చేయలేదు అని రాంచరణ్ తెలిపాడు.
తాజా సమాచారం మేరకు క్రిష్ చెప్పిన ఓ పీరియాడిక్ డ్రామా పట్ల పవన్ కళ్యాణ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దర్శకుడు క్రిష్ కథకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు.
ఇదిలా ఉండగా ఈ చిత్రానికి పవన్ తీసుకోబోతున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారుతోంది. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రానికి ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మామూలుగానే పవన్ చిత్రాలకు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ నమోదవుతుంటాయి. ఈ నేపథ్యంలో పవన్ తన రీఎంట్రీ చిత్రానికి దాదాపు 50 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ కూడా 50 కోట్ల వరకు సినిమాకు ఛార్జ్ చేస్తున్నాడు. కాకపోతే మహేష్ కొంత రెమ్యునరేషన్ అందుకుని మరికొంత సినిమాలో వాటా తీసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ నేరుగా 50 మొత్తం అందుకుంటా లేక వాటా తీసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.
ఇక క్రిష్ పవన్ సినిమాపై చాలా లోతుగా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇది మెమొరబుల్ మూవీగా ఉండిపోవాలని క్రిష్ కృషి చేస్తున్నాడు. తాజా సమాచారం మేరకు మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది. త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన అన్ని వివరాలు తెలియనున్నాయి.