'సైరా' చూశాక నా ఒళ్ళు గగుర్పొడిచింది.. చిరుపై నారా లోకేష్ ప్రశంసల వర్షం!
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. చిరంజీవి కలల ప్రాజెక్ట్ సైరా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే సైరా చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలయింది. సైరా చిత్రంలో నిర్మాణవిలువలు, సురేందర్ రెడ్డి దర్శకత్వ ప్రతిభ అద్భుతం అంటూ సినీప్రముఖులంతా ప్రశంసిస్తున్నారు.
టాలీవుడ్ ప్రముఖులంతా మెగాస్టార్ సైరా చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తన తండ్రికి కానుకగా రాంచరణ్ ఈ చిత్రాన్ని 250 కోట్ల బడ్జెట్ లో నిర్మించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సైరా చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.
తాజాగా సైరా చిత్రంపై నారా లోకేష్ సోషల్ మీడియాలో స్పందించారు. 'తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన సినిమా సైరా. చిరంజీవి గారు తన 12 ఏళ్ల కలని అద్భుతంగా నెరవేర్చుకున్నారు. తెలుగు వీరుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటాన్ని తెరపై చూస్తుంటే నా ఒళ్ళు గగుర్పొడిచింది. చిరంజీవి గారికి హ్యాట్సాఫ్.
ఎంతో శ్రమించి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాత రాంచరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, ఇతర సాకేంతిక నిపుణులకు నా హార్థికాభినందనలు' అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార నటించారు. తమన్నా నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.