మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం దర్సధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ లో నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో నటించడం రాంచరణ్ కు ఇది రెండవసారి. గతంలో వీరిద్దరి కాంబోలో మగధీర చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. 

మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. 1920 బ్రిటిష్ కాలం నేపథ్యంలో తెరక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది జులై 30న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మొన్నటివరకు సైరా చిత్ర నిర్మాణం, ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో చరణ్ తీరికలేకుండా గడిపాడు. సైరా విడుదలై మంచి విజయం సాధించడంతో చరణ్ కు కాస్త సమయం దొరికింది. దీనితో పలువురు దర్శకులు తన కోసం సిద్ధం చేసిన కథలని రాంచరణ్ వింటున్నాడట. 

ఇటీవల 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ రాంచరణ్ ని కలసి ఓ స్టోరీ లైన్ వినిపించాడట. ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పూర్తి కథ సిద్ధం చేసి తనకు నేరేషన్ ఇవ్వాలని రాంచరణ్ విక్రమ్ కుమార్ ని కోరినట్లు తెలుస్తోంది. విక్రమ్ కుమార్ ఎంచుకునే కథాంశాలన్నీ మాస్ ప్రేక్షకులకు దూరంగా ఉంటాయి. 

విక్రమ్ తెరక్కించిన చిత్రాల్లో మనం, ఇష్క్ మంచి విజయం సాధించాయి. 24, హలో, గ్యాంగ్ లీడర్ చిత్రాలు బావున్నప్పటికీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ విక్రమ్ కుమార్ తో సినిమా చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో మరి. విక్రమ్ అద్భుతమైన కథని సిద్ధం చేస్తే రాంచరణ్ హీరోగా తప్పకుండా సినిమా ఉంటుంది. 

మరోవైపు రాంచరణ్, కొరటాల దర్శకత్వంలో కూడా ఓ చిత్రం ఉండబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఓ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.