జీవిత హర్టై ఉంటారు, ఎన్ని అవమానాలు జరిగితే హేమ అంత గట్టిగా మాట్లాడుతుంది: ప్రకాశ్ రాజ్
సినీ తారలు జీవితా రాజశేఖర్, హేమలపై మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అవమానాలకు గురైతే హేమ అంత గట్టిగా మాట్లాడుతుందని ఆయన అన్నారు.
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న సినీ తారలు జీవితా రాజశేఖర్, హేమలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఎవరి ఎజెండాలు వారికి ఉంటాయని ఆయన అన్నారు. జీవిత బలమైన మహిళ అని, కిందటిసారి ఆమెను ప్రెసిడెంట్ చేస్తామన్నారని, కానీ అది జరగలేదని, దాంతో ఆమె హర్టయి ఉంటారని ఆయన అన్నారు.
ఎన్ని అవమానాలు జరిగితే హేమ అంత గట్టిగా మాట్లాడుతుందని ప్రకాశ్ రాజ్ అన్నారు. అయినా ఎక్కడైనా ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ఆయన అన్నారు. మా సభ్యులు 900 మంది ఉన్నారని, రోజుకు కొద్ది మందికి ఫోన్ చేసి ఓటు అడిగినా సరిపోతుందని ఆయన అన్నారు. తాను అందరినీ కలుస్తానని చెప్పారు.
Also Read: అనూహ్యంగా మారకుండా చూద్దామని మంచు విష్ణుతో చెప్పా: ప్రకాశ్ రాజ్
తమ ఎజెండా చెబుతానని, తమకు ఓటు వేయాలని అడుగుతానని, ఏ ఒక్కరికి కూడా వ్యతిరేకంగా మాట్లాడబోనని ఆయన చెప్పారు. తమ మేనిఫెస్టో చూసిన తర్వాత సభ్యులు తమకు ఓటు వేస్తారనే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు.
ప్యానల్ జాబితాను గమనిస్తే తాము ఎవరికీ పోస్టులు ఇవ్వలేదని ఆయన చెప్పారు. తమ ప్యానెల్ లో డాక్టర్లు, సోషల్ వర్కర్లు, అకౌంటింగ్ చూసేవారు, స్పోర్ట్స్ వర్కర్స్ ఉన్నారని, ఇలా రకరకాల వృత్తులవాళ్లు ఉన్నారని ఆయన చెప్పారు. తాము ఏర్పాటు చేసే ఉపసంఘాలకు వీరే నేతృత్వం వహిస్తారని ఆయన చెప్పారు. రేపు తానేదైనా తప్పు చేస్తే నిలదీసి అడగగలిగేవారని చెప్పారు.
Also Read: ప్రకాష్ రాజ్ కోసం.. జయసుధ, సాయి కుమార్ వీడియో సందేశాలు!
సభ్యులకు సంబంధించిన సైంటిఫిక్ డేటా ఉండాలని, ఒకరు ఆర్టిస్టు కొడుకు మా కార్యాలయానికి వస్తే మా నాన్న ఆర్టిస్టు అని గర్వంగా ఫీల్ కావాలని, అతని గుండె ఉప్పొంగాలని ఆయన అన్నారు. ఆ నమ్మకం, కౌగిలింపు సభ్యులకు సంఘం ఇవ్వాలని ఆయన అన్నారు. ఒక భారీ వృక్షం ఎంత మందికి నీడ ఇచ్చందనేది, ఎన్ని పక్షులకు ఆశ్రయం ఇచ్చిందనేది ముఖ్యమని ప్రకాశ్ రాజ్ అన్నారు. సభ్యులకు మా ఇచ్చేది దానం కాకూడదని, వారు కష్టపడి పనిచేసి సంపాదించుకున్న ఆత్మగౌరవం కావాలని ఆయన అన్నారు.
ఇంత వరకు చాలా మంది పనిచేశారు గానీ సస్టెనయిబిలీటీ లేదని ఆయన చెప్పారు. సభ్యుల ఆరోగ్యం గురించి ఎవరూ పట్టించుకోలేదని ఆయన చెప్పారు. మా అంటే అందులో ఉండే 900 మంది మాత్రమే కాదని, వారి మీద ఆధరపడిన కుటుంబాలు కూడా అని ఆయన అన్నారు.