'మా' ఎన్నికల వేడి: మహిళా సెంటిమెంటుతో నటుడు నరేష్ ట్విస్ట్
మా ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ ఎన్నికలకు సినీ నటుడు నరేష్ ట్విస్ట్ ఇచ్చారు. ఎన్నికలకు మహిళా సెంటిమెంటు అంశాన్ని జోడించి మరింత వేడి రాజేశారు.
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు ప్రస్తుత అధ్యక్షుడు, సినీ నటుడు నరేష్ ట్విస్ట్ ఇచ్చారు. మహిళా సెంటిమెంటుతో ఆయన ఆ ట్విస్ట్ ఇచ్చారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మా అధ్యక్ష పదవిని మహిళకు ఇవ్వాలనే ప్రతిపాదనను ఆయన తెర మీదికి తెచ్చారు.
మా అధ్యక్షురాలిగా ఓ మహిళను ఏకగ్రీవం చేద్దామని ఆయన సూచించారు. ఎన్నికలు అనివార్యం కాకుండా ఆ పనిచేద్దామని ఆయన సూచించారు. మహిళను అధ్యక్ష పదవికి ఏకగ్రీవం చేద్దామని తాను కమిటీకి ప్రతిపాదించానని, ఎవరు కూడా ముందుకు రాలేదని ఆయన అన్నారు.
ఇంతకు ముందు ఓ మహిళ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారని, అందువల్ల మహిళను అధ్యక్ష పదవికి ఏకగ్రీవం చేస్తే ఎన్నికలు జరగవని ఆయన అన్నారు. ఎన్నికల కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారని, అందరం ఒక తాటి మీదికి వద్దామని నరేష్ అన్నారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి రాజుకుంటోంది. మాపై సినీ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలను, ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు, సంస్థ అధ్యక్షుడు నరేష్ కౌంటర్ చేశారు. నాలుగేళ్లుగా మా మసకబారిపోయిందనే నాగబాబు వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. తాము అన్ని కార్యక్రమాలను మెగాస్టార్ చిరంజీవికి, నాగబాబుకు చెప్పినట్లు ఆయన తెలిపారు.
సంస్థను కించపరచడం సరి కాదని ఆయన అన్నారు. నాగబాబు వ్యాఖ్యలు తమను షాక్ గురి చేశాయని నరేష్ అన్నారు. పోటీ గురించి ప్రకాశ్ రాజ్ తనతో చెప్పారని ఆయన అన్నారు. లోకల్, నాన్ లోకల్ అనే విషయం గురించి తాము మాట్లాడబోమని ఆయన చెప్పారు. ఎవరిని గెలిపించాలనేది సభ్యుల నిర్ణయమని ఆయన చెప్పారు. తెలుగు సినిమాల్లో నటించేవాళ్లు ఎవరైనా పోటీ చేయవచ్చునని ఆయన అన్నారు. అయితే, ఎన్నికలు ఏకగ్రీవం కావాలని తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు.
మాలో 914 మంది సభ్యులు ఉన్నారని, సీనియర్ సిటిజన్స్ 18 మంది ఉన్నారని, 728 మందికి బీమా చేశామని, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ 26 మంది ఉన్నారని, అనుబంధ సభ్యుల సంఖ్య 29 మది ఉందని, ఈ లెక్కలు ప్రకాశ్ రాజ్ తప్పుగా చెప్పారని ఆయన అన్నారు. తాను ఆరేళ్లు మా అధ్యక్షుడిగా పనిచేశానని ఆయన చెబుతూ తాము చేపట్టిన కార్యక్రమాలను, సభ్యులకు తాము అందించిన సహాయాన్ని ఆయన వివిరించారు.
728 మంది సభ్యులకు తాము బీమా చేశామని ఆయన చెప్పారు. పింఛనును వేయి రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచామని ఆయన చెప్పారు. 16 మంది సభ్యులు చనిపోతే 48 లక్షల రూపాయల సహాయం అందించామని చెప్పారు. మా పనిచేయకపోతే, మా మసకబారిపోతే ఇంత మంది మాలో ఎందుకు చేరుతారని ఆయన అడిగారు.
చిరంజీవి చేసిన మంచి కార్యక్రమానికి లక్ష రూపాయలు ఇచ్చామని ఆయన చెప్పారు. సభ్యత్వ రుసుంను లక్ష రూపాయల నుంచి రూ.90 వేలకు తగ్గించామని ఆయన చెప్పారు. దాన్ని కూడా వాయిదాల రూపంలో చెల్లించడానికి అవకాశం కల్పించామని ఆయన చెప్పారు.కరోనా కాలంలో రూ.30 లక్షల విరాళాలు వచ్చాయని, పరిశ్రమతో సంబంధం లేనివారు కీూడా విరాళాలు ఇచ్చారని ఆయన చెప్పారు. జీవితా రాజశేఖర్ దంపతులు రూ. 10 లక్షల రూపాయలు ఇచ్చారని ఆయన చెప్పారు. తానేమీ కథలు చెప్పలేదని, ఉన్నదే చెప్పానని ఆయన చెప్పారు.
సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిబంధనల్లో ఉంది కాబట్టి ఏడాది కాలం కరోనా సమయంలో సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామని ఆయన చెప్పారు. మా అనేది ఓ దిగ్గజమని రెబెల్ స్టార్ కృష్ణంరాజు చెప్పమన్నారని ఆయన అన్నారు. కరోనా కాలంలో ప్యానెల్ పెట్టడం ఏమిటనేది ఆయన అడిగారు. తమ కమిటీ పనిచేస్తున్న ఈ సమయంలో ఓ ప్యానెల్ కు వెళ్లడమేమిటని ఆయన
కథలు చెప్పడం తనకు అలవాటు లేదని, కాగితాలతో రావడమే అలవాటు అని నరేష్ అన్నారు. ఎవరినో దూషించడానికి, ఎవరిపైనో కాలు దువ్వడానికి ఈ సమావేశం పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. నరేష్ అంటే ఏమిటో చెప్పుకోవాల్సిన అవసరం కూడా తనకు లేదని ఆయన చెప్పారు. తాను సినమావాడిని అని, మా బిడ్డను అని ఆయన చెప్పారు.
సినీ పరిశ్రమకు ఏ విధమైన కష్టం వచ్చినా సహాయం చేయడంలో తమ కుటుంబం ముందు ఉందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా తన తల్లి విజయనిర్మల చేసిన సహాయాన్ని వివరించారు. ప్రకాశ్ రాజ్ తనకు మంచి మిత్రుడు అని, ఎప్పుడో మూడు నెలల క్రితమే తనకు ఫోన్ చేసి మా ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారని నరేష్ వివరించారు. మంచు విష్ణు పరిశ్రమ బిడ్డ అని, కష్టనష్టాలు చూడకుండా సినిమాలు చేస్తూ వేలాది మందికి అన్నం పెడుతున్నారని ఆయన అన్నారు.