Karan Johar: ‘కేజీయఫ్-2’పై కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్, వైరల్
యశ్ స్టైల్, నటన, ప్రశాంత్ టేకింగ్ సినీ ప్రముఖులను సైతం ఫిదా చేశాయి. రవి బస్రూర్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన kgf2 చిత్రం ఏప్రిల్ 14న విడుదలై రూ. 1100 కోట్లు వసూలు చేసిన సినిమాల లిస్ట్ లో చేరిన సంగతి తెలిసిందే. విదేశాల్లోనూ ‘కేజీయఫ్’ హవా కొనసాగింది యశ్ స్టైల్, నటన, ప్రశాంత్ టేకింగ్ సినీ ప్రముఖులను సైతం ఫిదా చేశాయి. రవి బస్రూర్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన ‘కేజీయఫ్ ఛాప్టర్ 1’ ఇదే స్థాయిలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీలోనూ పెద్ద హిట్టైంది. తాజాగా ఈ చిత్రం గురించి కరణ్ జోహార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
‘కేజీయఫ్-2’ చిత్రాన్ని కనుక బాలీవుడ్లో తెరకెక్కించి ఉంటే అందరూ మాటల్తోనే చంపేసేవాళ్లని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ అన్నారు. బాలీవుడ్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ‘జుగ్ జుగ్ జియో’, ‘బ్రహ్మాస్త్ర’తోపాటు ‘లైగర్’కూ ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఆయా సినిమాల ప్రమోషన్స్లో బిజీగా పాల్గొంటూ ఆయన ఈ మాట అన్నారు. తాజాగా కరణ్ ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన బాలీవుడ్ నుంచి వస్తోన్న కంటెంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నుంచి ఈ మధ్యకాలంలో సరైన కంటెంట్ రాలేదని అన్నారు.
‘‘కథలను ఎంచుకోవడం, తెరకెక్కించే విషయంలో దక్షిణాది చిత్ర దర్శకులకు ఉన్న నమ్మకం.. ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో లోపించినట్లు అనిపిస్తోంది. ఒకే సినిమాలో ఎన్నో అంశాలను చూపించాలనుకుని.. కొన్నిసార్లు మేము విఫలమవుతుంటాం. కానీ, దక్షిణాది దర్శకులు.. ఏం చెప్పాలనుకుంటే దాన్ని సరిగ్గా, ప్రేక్షకుడికి చేరువయ్యేలా సినిమాలు రూపొందిస్తున్నారు. ఇటీవల నేను ‘కేజీయఫ్-2’ చూశా. మనస్ఫూర్తిగా చెబుతున్నా ఆ సినిమా నాకెంతో నచ్చింది. ఆ సినిమానే బాలీవుడ్లో తీసుంటే.. మాకెన్నో విమర్శలు ఎదురయ్యేవి. విమర్శలతో అందరూ మమ్మల్ని చంపేసేవాళ్లు’’ అని కరణ్ జోహార్ అన్నారు.