ప్రముఖ హీరో సూర్య ఆయన భార్య, పిల్లలతో కలిసి ముంబయికి మకాం మార్చాడని, తమిళనాడులోని ఆయన కుటుంబానికి దూరంగా జరిగాడని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై సూర్య తాజాగా స్పందించి వివరణ ఇచ్చారు. తాను ముంబయికి కేవలం పిల్లల చదువుల కోసమే వచ్చానని, తిరిగి తమిళనాడుకు వెళ్లిపోతానని చెప్పారు.
చెన్నై: ప్రముఖ హీరో సూర్యకు అటు తమిళంలో, ఇటు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ వస్తున్నది. ఇక్కడ కూడా సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్నది. కేవలం యాక్టర్గానే కాదు.. నిర్మాతగానూ ఆయన అభిరుచి అందిరికీ నచ్చుతుంది. అందుకే ఆయన ప్రతి కదలికపైనా అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల కొన్ని రోజుల నుంచి ఆయన తమిళనాడులోని ఆయన కుటుంబానికి దూరంగా ముంబయిలో (భార్య జోతిక, పిల్లలతో కలిసి) ఉంటున్నారు. తండ్రి, తమ్ముడితో గొడవల వల్లే ఆయన ముంబయిలో ఇల్లు తీసుకుని ఉంటున్నారా? అనే చర్చ జరిగింది. దీనిపై ఆయన ఫ్యాన్స్లో ఆందోళన కలిగింది.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే సూర్య ఇటీవలే ముంబయిలో నిర్వహించిన ఓ ఫ్యాన్స్ మీట్కు హాజరయ్యారు. ఇందులో సినిమాలతోపాటు వ్యక్తిగత విషయాలకు సంబంధించిన సమాధానాలూ ఇచ్చారు. ఆయన ముంబయికి మారడం గురించీ ఒకరు అడిగారు. ఈ ప్రశ్నకు సూర్య స్పష్టంగా సమాధానం ఇచ్చారు.
Also Read: శ్రీదేవి పుట్టిన రోజు... 'గూగుల్' గౌరవించింది ఇలా
ఆయన కుటుంబంతో విడిపోయి ముంబయిలో ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారనే వార్తలపై సూర్య ఇది వరకు స్పందించలేదు. కానీ, తాజాగా, ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తాను తమిళనాడును విడిచిపెట్టబోనని స్పష్టం చేశారు. అది తన జన్మస్థలం అని వివరించారు. అయితే.. తాను కుటుంబంతో సహా ముంబయికి రావడానికి తమ పిల్లలే కారణం అని చెప్పారు. వారి చదువుల కోసమే ఇక్కడ ఉండాల్సి వచ్చిందని తెలిపారు. అంతే తప్పితే తాను ఎప్పటికీ ఇక్కడే ఉండిపోడం లేదని స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ తమిళనాడులోనే ఉంటానని తెలిపారు.
దీంతో పై రూమర్స్కు చెక్ పడింది. దీంతో అభిమానుల్లో ఆందోళన ముగిసింది.
