స్టార్ మాజీ దంపతులను కలిపిన కరోనా
భార్య భర్తలుగా విడిపోయినా తల్లి దండ్రులుగా మాత్రం ఎప్పుడు ది బెస్ట్ అనిపించుకుంటున్నారు బాలీవుడ్ స్టార్ కపుల్ హృతిక్ రోషన్, సుసానే. తాజాగా కరోనా లాక్ డౌన్ సందర్భంగా పిల్లలతో కలిసి ఉండేందుకు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు ఈ మాజీ భార్యా భర్తలు.
చాలా కాలం కిందటే విడాకులు తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్ హృతిక్ రోషన్, సుసానే ఖాన్లు ఇప్పుడు భార్యా భర్తల్లా ఒకే ఇంట్లో ఉంటున్నారు. హృతిక్ సుసానే భార్య భర్తలుగా విడిపోయి చాలా కాలమే అవుతున్నా పిల్లల కోసం తరుచూ కలుస్తూ ఉన్నారు. ఇటీవల వీరి పిల్లలు హ్రీహాన్, హ్రీధాన్లు విదేశాల నుంచి తిరిగి వచ్చారు. అయితే అదే సమయంలో 21 రోజులు పాటు దేశంలో లాక్ డౌన్ విధించటంతో అన్ని రోజుల పాటు పిల్లలకు దూరంగా ఉండలేక సుహానే కూడా హృతిక్ ఇంటికే వచ్చేసింది. ఈ విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ స్వయంగా వెల్లడించాడు.
సుహానే తన ఇంట్లో ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన హృతిక్ రోషన్ `ఈ ఫోటోలో ఉన్నది ప్రియమైన సుసానే (నా మాజీ భార్య). పిల్లల కోసం తానే స్వయంగా ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇంత సపోర్టివ్ గా ఉన్నందుకు థ్యాంక్యూ. మన కథను పిల్లలు భవిష్యత్తులో గుర్తు చేసుకుంటారు` అంటూ కామెంట్ చేశాడు హృతిక్.
2000 సంవత్సరంలో సుసానేను వివాహం చేసుకున్న హృతిక్, సుసానేలు మనస్పర్థల కారణంగా 2014లో విడాకులు తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి ఇద్దరు మరో వివాహం చేసుకోకుండా పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. మంగళవారం తమ అడ్వంచరస్ ట్రిప్కు సంబంధించిన వీడియోను షేర్ చేసిన హృతిక్, బుధవారం సుసానే ఫోటోను పోస్ట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చాడు.