ఆడియెన్స్ సౌకర్యార్థం మొబైల్ సినిమా థియేటర్ రూపుదిద్దుకుంటోంది. ఇక ప్రేక్షకుల వద్దకే బ్లాక్ బాస్టర్ సినిమాలు వచ్చి ఆడనున్నాయి. ఏపీలో మొబైల్ థియేటర్ ఈ నెలాఖరులోగా అందుబాటులోకి రానుంది.  

ఇకపై తెలుగు ప్రేక్షకుల వద్దకే సినిమా థియేటర్ రానుంది. వారికి నచ్చిన సినిమాలను వారి ప్రాంతంలోనే ఆడించేందుకు సరికొత్త మొబైల్ థియేటర్ ను రూపొందిస్తున్నారు. దేశంలో మొట్టమొదట 1930లో ‘కోహినూర్ ఒపేరా’ పేరుతో అస్సాం (Assam) రాష్ట్రంలో మొబైల్ థియేటర్ (Mobile Theatre)ను ప్రారంభించారు. దీనిని నాట్యాచార్య బ్రజనాథ్ శర్మ 90  ఏండ్ల కిందనే స్థాపించారు. అయితే ఈ థియేటర్ ద్వారా కోహినూర్ ఒపేరా ధుబ్రీ నుండి సదియా వరకు వేలాది మంది ప్రేక్షకులను ఆకర్షించి నాటకాలను ప్రదర్శించారు. మొదటి మొబైల్ థియేటర్ నాటకం 2 అక్టోబర్ 1963న ఆ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో ప్రదర్శించారు. ప్రస్తుతం 150 నుంచి 160 వరకు మొబైల్ థియేటర్లు రన్ అవుతున్నట్టు సమాచారం. 

ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్ లోనూ మొదటి మొబైల్ సినిమా ధియేటర్ రూపుదిద్దుకుంటోంది. ఇది ట్రక్కులో ఎక్కడికైనా తీసుకుపోయి అమర్చుకోగల మొబైల్ సినిమా హాల్ . ఏపీలో రాజానగరం వద్ద నేషనల్ హైవే పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ ధియేటర్ ఏర్పాటౌతోంది. వెదర్ ప్రూఫ్, ఫైర్ ఫ్రూఫ్ పద్ధతుల్లో వేసిన టెంట్ లో గాలినింపే టెక్నాలజీతో 120 సీట్ల కెపాసిటీతో ఈ ఏసీ థియేటర్ ను నిర్మిస్తున్నారు. ‘పిక్చర్ డిజిటల్స్’ సంస్ధ ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పుతున్న మొబైల్ ధియేటర్లలో ఇది మొదటిది. 

ఈ మొబైల్ థియేటర్ నిర్మాణ పనులు దాదాపు పూర్తికావస్తున్నాయి. ఈ నెలాఖరుకు ముందే దీనిని ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది ఒకప్పటి టూరింగ్ టాకీసులకు ఆధునికమైన, సౌకర్యవంతమైన రూపం.
 థియేటర్ లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాతోనే మొదటి  ప్రదర్శన ప్రారంభమవుతుందని సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.  చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటిస్తున్న భారీ చిత్రం ‘ఆచార్య’ (Acharya)నే ఈ మొబైల్ థియేటర్ లో తొలి ప్రదర్శన కానుంది. ఇందుకు మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఆచార్య మూవీ ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఆ రోజే మొబైల్ థియేటర్ ను ప్రదర్శిస్తారా లేక ఇంకాస్త సమయం పడుతుందా అనేది తెలియాల్సి ఉంది. 

బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ RRR దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) తెలంగాణ రాష్ర్టంలోని ఆసిఫాబాద్‌లోని మొబైల్ డిజిటల్ థియేటర్‌లో ‘ఆర్ఆర్ఆర్’ను వీక్షించారు. ఈ థియేటర్ కు ‘కొమురం భీం థియేటర్’ అని పేరు పెట్టారు. ఈ థియేటర్ ను జిల్లా సమాఖ్య, పిక్చర్ టైమ్ సంయుక్తంగా ఏర్పాటు కేబీ థియేటర్‌ ను రూపొందించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో నిర్మించిన థియేటర్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రలో తాను నటించిన భారీ చిత్రాన్ని వీక్షించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి థియేటర్‌ను నెలకొల్పాలని చాలా కాలంగా ఆలోచనలో ఉన్నానని తెలిపారు.