ప్రఖ్యాత శాస్త్రీయ గాయకుడు విజయ్ కిచ్లు 93 సంవత్సరాల వయస్సులో శుక్రవారం మరణించారు. చాలా కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ లో తుది శ్వాస  విడిచారు.  

పండిట్ విజయ్ కిచ్లూ కన్నుమూత: శాస్త్రీయ సంగీత విద్వాంసుడు ,'పద్మశ్రీ' పండిట్ విజయ్ కిచ్లూ కన్నుమూశారు. 93 ఏళ్ల కిచ్లూ చాలా కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నాడు. శుక్రవారం సాయంత్రం దక్షిణ కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. విజయ్ కిచ్లూ ఊపిరి పీల్చుకునే స్థితిలో ఆస్పత్రిలో చేరాడని, చికిత్స ప్రారంభించేలోపు గుండె ఆగిపోయిందని ఆస్పత్రి ఓ ప్రకటనలో తెలియజేసింది. పండిట్ కిచ్లూ పద్మశ్రీతో పాటు సంగీత నాటక అకాడమీతో సహా అనేక అవార్డులు అందుకున్నారు. ఆయన సంగీత పరిశోధన అకాడమీని రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు.

పండిట్ విజయ్ కిచ్లూ.. 1930లో ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో జన్మించారు. చిన్నతనంలో నాథూరామ్ శర్మ వద్ద పాఠాలు పాడటం ప్రారంభించాడు, తరువాత మొయినుద్దీన్ డాగోర్, అలీముద్దీన్ దాగోర్ వద్ద శిష్యరికం చేశారు. బీఏ గ్రాడ్యుయేట్ అయిన పండిట్ కిచ్లూ 1955లో బ్రిటిష్ షిప్పింగ్ కంపెనీలో పనిచేయడానికి కోల్‌కతాకు వెళ్లారు. కానీ.. సంగీతంపై మక్కువ మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో బెంగాల్ సంగీతకారులతో స్నేహం పరిచయాలు పెంచుకున్నారు. 

దీదీ సంతాపం

అతని సంగీత ప్రస్తానం ఎనిమిది దశాబ్దాలుగా సాగింది. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, 'ప్రముఖ సంగీత విద్వాంసుడు పండిట్ విజయ్ కిచ్లూ మృతి చెందడం నాకు చాలా బాధ కలిగించింది. ఆయన వద్ద లెక్కలేనంతా మంది యువ కళాకారులు శిక్షణ పొందారు. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు' అని అన్నారు.

అభిమానుల సందర్శనార్థం.. ఆయన మృతదేహాన్ని ఆదివారం (రేపు) మధ్యాహ్నం 12 గంటల నుంచి రవీంద్ర సదన్‌లో ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు. కుమారుడు రోహిత్ కిచ్లు మాట్లాడుతూ, 'నాన్న సంగీతానికి సాధువు. తన జీవితమంతా సంగీతానికే అంకితం చేశాడని పేర్కొన్నారు.