మెగా సాయం.. సినీ కార్మికులకు రూ. కోటి విరాళం ప్రకటించిన చిరు
కరోనా పై యుద్ధానికి మెగా ఫ్యామిలీ పూర్తి మద్దతును అందిస్తోంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2 కోట్లు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 70 లక్షలు పీఎం, సీఎంల సహాయ నిథికి విరాళాలు ప్రకటించగా, తాజాగా చిరంజీవి సినీ కార్మికుల కోసం కోటీ రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు.
కరోనాపై యుద్దానికి ప్రతీ ఒక్కరు తమ మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ పెద్ద తమ వంతు సాయం అంధించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్రా ప్రభుత్వాలకు కలిపి 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించాడు. బాబాయ్ బాటలో అబ్బాయి కూడా 70 లక్షల రూపాయలం సాయం ప్రకటించాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు.
కరోనా ప్రభావంతో షూటింగ్ లు ఆగిపోవటంతో సినీ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారి కోసం కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టుగా ప్రకటించాడు మెగాస్టార్. `ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ పరిస్థితులు, కరోనా మహమ్మారి ప్రభలకుండా ఉండేందుకు అనివార్యం. కానీ ఈ లాక్ డౌన్ కారణంగా రోజువారి కూలీలు, పేద కుటుంబాలు తీవ్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇలాంటి పరిస్థితులే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనూ ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని సినీ కార్మికుల సహాయార్థం కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నాను` అంటూ ట్వీట్ చేశాడు చిరు.
ఉగాది సందర్భంగా నిన్న సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి, అప్పటి నుంచి ట్విటర్ యాక్టివ్గా ఉంటున్నాడు. తనను ఈ ప్లాట్ ఫాంలోకి ఆహ్వానించిన ప్రతీ ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతూ, అదే సమయంలో కరోనా పై సూచనలు చేస్తున్నాడు. ఇక సినిమాల విషయానికి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు చిరంజీవి. కరోనా ప్రభావం కారణంగా ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది.