లాక్ డౌన్లోనూ సినిమా పనులు ప్రారంభించిన సూపర్ స్టార్
ప్రస్తుతం కరోనా ప్రభావంతో ప్రపంచ మంతా లాక్ డౌన్ అయి అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ఈ ప్రభావం సినీ రంగం మీద కూడా భారీగానే ఉంది. అయితే సల్మాన్ ఖాన్ మాత్రం తన సినిమాల మీద ఈ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
కరోనా దెబ్బకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కుదేలవుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సినీ రంగం 1500 కోట్లకు పైగా నష్టపోయినట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఇప్పట్లో చక్కబడే పరిస్థితి లేకపోవటంతో ముందు ముందు నష్టాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఇండస్ట్రీ ప్రముఖులు నష్ట నివారణ చర్చలకు దిగుతున్నారు. ఎక్కువగా ప్రజలు గుమిగూడే అవసరంలేని నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసేస్తున్నారు.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉన్నాడు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో రాథే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యింది. ఒక పాట మినహా మిగతా షూటింగ్ పూర్తి కావటంతో చిత్రయూనిట్ తదుపరి కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు. అందుకే షూటింగ్ పనులు పక్కన పెట్టి నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభించాడు సల్మాన్.
ప్రభుత్వాలు వర్క్ ఫ్రమ్ హోంకు అనుమతి ఇవ్వడంతో రాథే సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభించాడు సల్మాన్. ముంబైలోని తన పాన్వెల్ ఫాం హౌస్ లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అతి కొద్ది మంది టెక్నిషియన్స్తో ఈ కార్యక్రమాలు ప్రారంభించాడు సల్లూ భాయ్. ప్రస్తుతం చిత్ర దర్శకుడు ప్రభుదేవా చెన్నైలో ఉన్నా సినిమా పనులు ఆలస్యం కావద్దన్న ఉద్దేశంతో సల్మాన్ స్వయం దగ్గరుండి నిర్మాణాంతర కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నాడు. దిశపటాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, రణదీప్ హుడా, భరత్ లు కీ రోల్స్ లో నటిస్తున్నారు.