WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న క్షణాలు వచ్చాయి. ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ ఓడిన ఆ జట్టు.. నేడు విజయం ముంగిట నిలిచింది.
ఆడిన ఐదు మ్యాచ్ లలో ఐదింటికీ ఓడి తీవ్ర నిరాశపరిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ తో తొలిసారి బౌలింగ్ లో ఒక ప్రత్యర్థి జట్టు మీద పూర్తి ఆధిపత్యం చెలాయించింది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా యూపీ వారియర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లు అదరగొట్టారు. పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న యూపీని కట్టడి చేశారు. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాణించారు. బెంగళూరు బౌలర్ల సూపర్ షో తో యూపీ... 19.3 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌట్ అయింది. ఆర్సీబీ ఎదుట ఈజీ టార్గెట్ ను నిలిపింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన యూపీ ఇన్నింగ్స్ ఆది నుంచి ఒడిదొడుకుల మధ్యే సాగింది. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. సోఫీ డివైన్ వేసిన తొలి ఓవర్లో రెండో బంతికే దేవికా వైద్య (0) ఎల్బీగా వెనుదిరిగింది. అదే ఓవర్లో చివరి బంతికి కెప్టెన్ అలీస్సా హేలి (1) కూడా ఔటయింది.
మేగన్ షుట్ వేసిన రెండో ఓవర్లో ఆఖరి బంతికి తహిలా మెక్గ్రాత్ (2) రిచా గోష్ కు క్యాచ్ ఇచ్చింది. ఆ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన కిరణ్ నవ్గిరె (26 బంతుల్లో 22, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆదుకోవడానికి యత్నించింది. కానీ ఆశా శోభన యూపీకి షాకిచ్చింది. ఆమె వేసిన ఏడో ఓవర్ రెండో బంతికి నవ్గిరె.. వికెట్ కీపర్ రిచా ఘోష్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఆశా వేసిన 9వ ఓవర్ తొలి బంతికి సిమ్రాన్ షేక్ (2) కూడా కనికకు క్యాచ్ ఇచ్చింది. 10 ఓవర్లకు యూపీ స్కోరు 5 వికెట్ల నష్టానికి 43 పరుగులే..
ఆదుకున్న హరీస్..
యూపీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్నా హరీస్ (32 బంతులలో 46, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మాత్రం నిలకడగా ఆడింది. దీప్తి శర్మ (19 బంతుల్లో 22, 4 ఫోర్లు) తో కలిసి ఆమె యూపీ ఇన్నింగ్స్ ను నడిపించింది. యూపీ ఆ మాత్రం స్కోరైనా చేసిందంటే అది హరీస్ చలవే. దీప్తి శర్మతో కలిసి హరీస్ 42 బంతుల్లోనే 69 పరుగులు జోడించింది. ఆశా శోభన వేసిన 11వ ఓవర్లో రిచా ఘోష్ స్టంప్ చేసే అవకాశం జారవిడవడంతో హరీస్ దానిని సద్వినియోగం చేసుకుంది. శ్రేయాంక పాటిల్ వేసిన 12వ ఓవర్లో 6,4 కొట్టింది. ఈ ఓవర్లో 15 పరుగులొచ్చాయి. ఆశా శోభన వేసిన 13వ ఓవర్లో హరీస్.. 4,6,4 పరుగులు రాబట్టింది. డివైన్ వేసిన 14వ ఓవర్లో దీప్తి రెండు బౌండరీలు బాదింది. రేణుకా సింగ్ వేసిన 15వ ఓవర్లో హరీస్ రెండు ఫోర్లు కొట్టడంతో యూపీ స్కోరు వంద పరుగులు దాటింది.
బ్రేక్ ఇచ్చిన పెర్రీ..
అర్థ సెంచరీ పూర్తి చేసుకుని భారీ స్కోరు మీద కన్నేసిన ఈ జోడిని ఎలీస్ పెర్రీ విడదీసింది. ఆమె వేసిన 16వ ఓవర్లో తొలి బంతికి దీప్తి.. భారీ షాట్ ఆడబోయి శ్రేయాంక పాటిల్ చేతికి చిక్కింది. అదే ఓవర్లో మూడో బంతికి హరీస్ కూడా రిచా ఘోష్ కు క్యాచ్ ఇచ్చింది. దీంతో యూపీ ఏడో వికెట్ కోల్పోయింది. పెర్రీనే వేసిన 18వ ఓవర్లో రెండో బంతికి శ్వేతా సెహ్రావత్ (6) క్లీన్ బౌల్డ్ అయింది. చివరి ఓవర్ వేసిన శ్రేయాంక పాటిల్.. రెండో బంతికి అంజలి శర్వని (8) ని ఔట్ చేయగా.. తర్వాత బంతికే ఎకిల్స్టోన్ (12) రనౌట్ అయింది. పలితంగా యూపీ.. 135 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆర్సీబీ బౌలర్లో పెర్రీ మూడు వికెట్లు తీసింది. నాలుగు ఓవర్లు వేసిన ఆమె.. 16 పరుగులే ఇచ్చి కీలక వికెట్లు పడగొట్టింది. ఆశా శోభన, సోఫీ డివైన్ లు తలా రెండు వికెట్లు పడగొట్టగా శ్రేయాంక పాటిల్, మేగన్ షుట్ చెరొక వికెట్ తీశారు.
