WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో పటిష్టమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ కు ఎదురేలేకుండా పోయింది. ఆడిన మూడు మ్యాచ్ లలోనూ ఆ జట్టు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది.
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్.. అదే జోరును ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా కొనసాగిస్తోంది. తొలి సీజన్ లో ఇప్పటివరకు ఆ జట్టు మూడు మ్యాచ్ లు ఆడగా మూడింటిలోనూ విజయాలు సాధించి ఎదురేలేకుండా దూసుకుపోతున్నది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలుత ఢిల్లీని 105 పరుగులకే కట్టడి చేసిన ఆ జట్టు తర్వాత లక్ష్యాన్ని 15 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆ జట్టు ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (31 బంతుల్లో 32, 6 ఫోర్లు), యస్తికా భాటియా (32 బంతుల్లో 41, 8 ఫోర్లు) లు ధాటిగా ఆడి కు హ్యాట్రిక్ విజయాన్ని ఖాయం చేశారు.
స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబైకి శుభారంభమే దక్కింది. ఓపెనర్లు యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్ లు ఆది నుంచే ఢిల్లీ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. తొలి ఓవర్లోనే యస్తికా రెండు ఫోర్లు కొట్టింది.
శిఖా పాండే వేసిన నాలుగో ఓవర్లో మాథ్యూస్ హ్యాట్రిక్ బౌండరీలు సాధించింది. కాప్ వేసిన ఐదో ఓవర్లో యస్తికా మూడు ఫోర్లు బాదింది. తొలి పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టపోకుండా 47 పరుగులు చేసింది. రాధా యాదవ్ వేసిన ఏడో ఓవర్లో యస్తికా రెండు బౌండరీలు బాదింది. కానీ తారా నోరిస్ ఢిల్లీకి బ్రేక్ ఇచ్చింది. ఆమె వేసిన 9వ ఓవర్లో ఐదో బంతికి యస్తికా ఎల్బీగా వెనుదిరిగింది. దీంతో 65 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
యస్తికా నిష్క్రమణ అనంతరం సీవర్ (19 బంతుల్లో 23 నాటౌట్, 4 ఫోర్లు) క్రీజులోకి వచ్చింది. జొనాసేన్ వేసిన పదో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన మాథ్యూస్.. క్యాప్సీ వేసిన 11వ ఓవర్లో మూడో బంతికి రోడ్రిగ్స్ సూపర్ క్యాచ్ పట్టడంతో నిష్క్రమించింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన హర్మన్ప్రీత్ (8 బంతుల్లో 11 నాటౌట్, 2 ఫోర్లు) తో కలిసి సీవర్ ఇన్నింగ్స్ ను ముగించింది. శిఖా పాండే వేసిన 13వ ఓవర్ల వరుసగా రెండు బౌండరీలు బాదింది.
క్యాప్సీ వేసిన 14వ ఓవర్లో కౌర్ రెండు బౌండరీలు కొట్టడంతో ముంబై స్కోరు వంద దాటింది. జొనాసేన్ వేసిన 15వ ఓవర్లో ఐదో బంతికి సీవర్ రెండబు బౌండరీలు బాది ముంబై విజయాన్ని ఖాయం చేసింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. 18 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో కెప్టెన్ మెగ్ లానింగ్ (43) మినహా అంతా విఫలమయ్యారు. జెమీమా (25), రాధా యాదవ్ (10) తప్ప మిగిలినవారంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.
