ఈనెల 13న వేలం.. తేల్చేసిన హర్మన్ప్రీత్.. వేలం ఎక్కడంటే..? బేస్ ప్రైస్, టీమ్స్, ఇతరత్రా వివరాలివే..
WPL Auction 2023: ఈ ఏడాది మార్చి 4 నుంచి 26 మధ్య ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహకాలను ముమ్మరం చేసింది. కాగా ఈ లీగ్ కు ముందు నిర్వహించే ఆటగాళ్ల వేలం జరగాల్సి ఉంది.
భారత క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ వచ్చే నెలలో మొదలుకానుంది. మార్చి 4 నుంచి 26 మధ్య డబ్ల్యూపీఎల్ ను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహకాలను ముమ్మరం చేసింది. కాగా ఈ లీగ్ కు ముందు నిర్వహించే ఆటగాళ్ల వేలం జరగాల్సి ఉంది. ప్లేయర్స్ యాక్షన్ ఈనెల 13న ఉండనుంది. ఈ విషయాన్ని స్వయంగా భారత మహిళల క్రికెట్ జట్టు సారథి హర్మన్ప్రీత్ కౌర్ వెల్లడించింది.
వేలం వేదికను గతంలో ఢిల్లీలో నిర్వహించాలని భావించినా తర్వాత బీసీసీఐ మనసు మార్చుకుంది. తాజా సమాచారం ప్రకారం 13న జరిగే వేలం ముంబైలో జరుగనుంది. అంతకంటే ముందు రోజే మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్ - పాక్ మధ్య కీలక పోరు జరగనుండటం గమనార్హం. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతున్న క్రమంలోనే హర్మన్ వేలం తేదిని వెల్లడించింది.
వేలం తేదీ ఖరారైన నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ గురించిన ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. ఈ లీగ్ లో బీసీసీఐ గతనెలలోనే ఐదు ఫ్రాంచైజీలు, అవి గెలుచుకున్న వారి వివరాలను ప్రకటించిన విషయం తెలిసిందే. పురుషుల ఐపీఎల్ మాదిరిగానే డబ్ల్యూపీఎల్ లో కూడా నగరాల పేరిట ఫ్రాంచైజీలను తీసుకొచ్చారు. ఐదు జట్లను వేలం వేయడం ద్వారా బీసీసీఐకి రూ. 4,669 కోట్లు సమకూరింది.
ఫ్రాంచైజీల వివరాలు
1. అహ్మదాబాద్ (అదానీ- గుజరాత్ జెయింట్స్) - రూ. 1,289 కోట్లు
2. ముంబై (అంబానీ) - రూ. 912.99 కోట్లు
3. బెంగళూరు (ఆర్సీబీ) - రూ. 901 కోట్లు
4. లక్నో (క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్) - రూ. 757 కోట్లు
5. ఢిల్లీ (ఢిల్లీ క్యాపిటల్స్) - రూ. 810 కోట్లు
వేలం ఎక్కడ..? ఎప్పుడు..?
- ఫిబ్రవరి 13. ముంబైలో
ఎంతమందిని కొనుగోలు చేయవచ్చు..?
- డబ్ల్యూపీఎల్ లో ఒక టీమ్ 15 నుంచి 18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. వీరిలో ఏడుగురు ఓవర్సీస్ (విదేశీ) ప్లేయర్లను తీసుకునే ఛాన్స్ ఉంది.
పర్స్ వాల్యూ..
- డబ్ల్యూపీఎల్ లో ఒక్కో టీమ్ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు రూ. 12 కోట్ల వరకు ఖర్చు చేసే లిమిట్ ఉంది.
బేస్ ప్రైస్ వివరాలు
- అన్ క్యాప్డ్ ప్లేయర్స్కు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఛాన్స్ ఉంది.
- క్యాప్డ్ ప్లేయర్స్కు రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకూ ఛాన్స్.
డబ్ల్యూపీఎల్ వేదికలు
- మార్చి 4 నుంచి 26 వరకు జరుగబోయే (షెడ్యూల్ ను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది) ఈ లీగ్ లో మ్యాచ్ లను ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంతో పాటు బ్రబోర్న్ స్టేడియంలో నిర్వహించనున్నారు.