న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిన పూజా వస్త్రాకర్... టీమిండియా ముందు 261 పరుగుల భారీ టార్గెట్ పెట్టిన కివీస్...
వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగుల భారీ స్కోరు చేసింది...
సూజీ బేట్స్ 5 పరుగులు చేసి రనౌట్ కాగా, కెప్టెన్ సోఫీ డివైన్ 30 బంతుల్లో 7 ఫోర్లతో 35 పరుగులు, అమిలియా కేర్ 64 బంతుల్లో 5 ఫోర్లతో 50 పరుగులు చేశారు. అమీ సథర్త్వైట్ 84 బంతుల్లో 9 ఫోర్లతో 75 పరుగులు చేయగా మ్యాడీ గ్రీన్ 36 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసింది...
51 బంతుల్లో 3 ఫోర్లతో 41 పరుగులు చేసిన వికెట్ కీపర్ కేటీ మార్టిన్ను జులన్ గోస్వామీ బౌల్డ్ చేయగా హేలీ జాన్సన్ 7 బంతుల్లో 1 పరుగు చేసి రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్లో పెవిలియన్ చేరింది.
ఒకానొక దశలో 42 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసిన న్యూజిలాండ్, భారత జట్టు ముందు భారీ లక్ష్యాన్ని పెట్టేలా కనిపించింది. అయితే భారత బౌలర్ పూజా వస్తాకర్ సంచలన స్పెల్తో కివీస్ బ్యాటర్లను కట్టడి చేసింది...
కెప్టెన్ సోఫీ డివైన్, 75 పరుగులు చేసి అమీ సథర్త్వైట్లను అవుట్ చేసిన పూజా వస్తాకర్, ఒకే ఓవర్లో వరుస బంతుల్లో లీ టహుహు, జెస్ కేర్లను అవుట్ చేసింది. ఫ్రాన్సెస్ మాకీ 13 పరుగులు, హన్నా రో 2 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు.
భారత బౌలర్లలో పూజా వస్తాకర్ 10 ఓవర్లలో 34 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా రాజేశ్వరి గైక్వాడ్ 10 ఓవర్లలో 4 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. జులన్ గోస్వామి 9 ఓవర్లలో ఓ మెయిడిన్తో 41 పరుగులిచ్చి ఓ వికెట్ తీసింది. దీప్తి శర్మకు ఓ వికెట్ దక్కింది.
ఆఖరి 8 ఓవర్లలో అద్భుతమైన రీతిలో కమ్బ్యాక్ ఇచ్చిన భారత బౌలర్లు, 8 ఓవర్లలో 38 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు. తొలి మ్యాచ్లో వెస్టిండీస్ జట్టుతో ఓడిన న్యూజిలాండ్ మహిళా జట్టు, బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది...
తొలి మ్యాచ్లో దాయాది పాకిస్తాన్ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత మహిళా జట్టుకి ఇది రెండో మ్యాచ్. తొలి రెండు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్న ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్నాయి. టాప్ 3లో ఉన్న భారత జట్టు, ఆ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలంటే, టాప్లోకి దూసుకెళ్లాలంటే నేటి మ్యాచ్లో విజయం సాధించాల్సి ఉంటుంది...
ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో దిగువన ఉంటే, సౌతాఫ్రికా జట్టు ఓ విజయంతో నాలుగో స్థానంలో, ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు రెండు మ్యాచుల్లో ఓ విజయం, మరో పరాజయంతో ఐదో స్థానంలో ఉంది.
