ఢిల్లీ జట్టులో సెహ్వాగ్ కొడుకు.. ఎక్కడికెళ్లినా నెపోటిజం తప్పట్లేదంటున్న నెటిజన్లు..
Virender Sehwag: నజఫ్గడ్ నవాబ్ వీరేంద్ర సెహ్వాగ్ పెద్దకుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. తండ్రి మాదిరే ఆర్యవీర్ కూడా క్రికెట్ నే కెరీర్ గా ఎంచుకున్నాడు.
టీమిండియా మాజీ ఓపెనర్, అభిమానులంతా నజఫ్గడ్ నవాబ్ అని పిలుచుకునే వీరేంద్ర సెహ్వాగ్ పెద్దకుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. తండ్రి మాదిరే ఆర్యవీర్ కూడా క్రికెట్ నే కెరీర్ గా ఎంచుకున్నాడు. తాను క్రికెట్ ఆడినప్పుడు ప్రపంచ దిగ్గజ బౌలర్లకు చుక్కలు చూపించిన సెహ్వాగ్ లాగే ఆర్యవీర్ కూడా దూకుడుగా ఆడతానని దూసుకొస్తున్నాడు. ఇందుకు పునాధిగా ఢిల్లీ క్రికెట్ జట్టులో ఆర్యవీర్ చోటు దక్కించుకున్నాడు.
2022-23కి గాను విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ క్రికెట్ జట్టు ప్రకటించిన అండర్ -16 టీమ్ లో ఆర్యవీర్ పేరు కూడా ఉంది. బీహార్ తో మ్యాచ్ సందర్భంగా ఆర్యవీర్.. ఢిల్లీ ప్రకటించిన 15 మందిలో ఒకడిగా ఉన్నాడు. తుది జట్టులో చోటు దక్కకపోయినా వీరూ కొడుకు 15 మందిలో ఒకడిగా ఉండటం గమనార్హం.
ఈ మేరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ట్విటర్ వేదికగా ఇందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. అయితే ఆర్యవీర్ తుది జట్టులో లేనప్పటికీ నెటిజనులు మాత్రం ఇది నెపోటిజం అని కామెంట్స్ పెడుతుండటం గమనార్హం. తన ఇన్ఫ్లూయెన్స్ తో వీరూ తన కొడుకును అండర్ - 16 టీమ్ లో చేర్పించాడని నెటిజనులు విమర్శిస్తున్నారు. ఎంతో మంది టాలెంటెడ్ క్రికెటర్లు ఉన్నా ఆర్యవీర్ పేరును చేర్చడానికి గల కారణాలను డీడీసీఏ వివరించాలని డిమాండ్ చేస్తున్నారు.
సాధారణంగా నెపోటిజం అనే పదం మనం బాలీవుడ్ లో ఎక్కువగా చూస్తుంటాం. రాజకీయాలలో కూడా ఇది ఎక్కువగా ఉంది. క్రికెట్ లో కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతుందని నెటిజనులు వాపోతున్నారు. ఈ నెపోటిజం కారణంగా సోషల్ మీడియాలో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ బాగా ట్రోల్ అయిన విషయం తెలిసిందే. సచిన్ కొడుకు కావడం వల్లే అర్జున్ ముంబై అండర్ -14, 16, 19, 23 లతో పాటు ఎంపీఎల్, సయ్యిద్ ముస్తాక్ అలీ, ముంబై రంజీ జట్టులో చోటు దక్కించుకున్నాడన్న విమర్శలు వినిపించాయి. తాజాగా వీరూ కొడుకుకు కూడా ఇవే ట్రోల్స్ ఎదురవుతుండటం గమనార్హం.