ఫైనల్ ముగిసి వారం కావస్తున్నా ఇంకా లండన్లోనే విరాట్ కోహ్లీ... అనుష్క శర్మతో కృష్ణదాస్ కీర్తన్ షోలో...
లండన్లో కృష్ణ దాస్ కీర్తన్ షోలో కనిపించిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట.. వచ్చే నెలలో వెస్టిండీస్ టూర్కి టీమిండియా!
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ ముగిసి దాదాపు వారం రోజులు కావస్తున్నా, చాలామంది క్రికెటర్లు ఇంకా స్వదేశానికి చేరుకోలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు దక్కించుకోలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్, ఇప్పటికే ఇండియాకి వచ్చి తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఆడుతున్నాడు...
కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు చాలామంది టీమిండియా ప్లేయర్లు, అటు నుంచి అటే మాల్దీవులకు చేరుకుని, అక్కడ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మ మాత్రం ఇంకా లండన్లోనే ఉన్నారు.. కొన్ని నెలలుగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయణిస్తున్న ఈ జంట, లండన్లో కృష్ణ దాస్ కీర్తన్ షోలో కనిపించారు.
కొన్ని నెలల క్రితం నీమ్ కరోలీ బాబా ఆశ్రమాన్ని సందర్శించిన విరుష్క జోడీ, ఆ తర్వాత ఉజ్జయినీలో ప్రత్యేక పూజలు నిర్వహించింది.. ఈ రెండు ఆధ్యాత్మిక యాత్రల తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి సెంచరీలు రావడంతో ఈ ఇద్దరూ ఖాళీ సమయాల్లో గుళ్లు, ఆశ్రమాలు అంటూ తిరుగుతున్నారు..
ఇప్పుడు లండన్లో కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలకే ఎక్కువ హజరవుతున్నారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ... 2019 తర్వాత మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి, సెంచరీ మార్కుని అందుకోవడానికి పడరాని కష్టాలు పడ్డాడు విరాట్ కోహ్లీ... ఈ టైమ్లో కూడా ఎలాంటి కొటేషన్లు పోస్ట్ చేయని విరాట్ కోహ్లీ, కొంత కాలంగా ఇన్స్టాలో మోటివేషన్ స్టేటస్లు పెడుతూ సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యపరుస్తున్నాడు..
అగ్రెసివ్ యాటిట్యూడ్తో దూకుడుకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండే విరాట్ కోహ్లీ, ఇలా సాధువులా మారిపోయి... దేవాలయాల చుట్టూ తిరగడం వెనక ఆయన సతీమణి అనుష్క శర్మ ఉందనే విషయం అందరికీ తెలుసు. రౌడీ క్రికెటర్గా ఉన్న విరాట్ కోహ్లీని ఇలా సాధు జీవిలా మార్చేసి, అనుష్క శర్మ, టీమిండియా క్రికెట్కి పెద్ద చేటు చేసిందని వాపోతున్నారు ఆయన అభిమానులు..
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్లో 14 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్లో 49 పరుగులు చేసి టీమిండియా తరుపున టాప్ స్కోరర్గా నిలిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత నెల రోజుల పాటు ఏ క్రికెట్ ఆడడం లేదు భారత క్రికెట్ జట్టు...
జూలై 12న వెస్టిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్ ఆడనుంది భారత జట్టు. ఈ టూర్కి త్వరలోనే టీమ్ని ప్రకటించబోతోంది బీసీసీఐ. వెస్టిండీస్ టూర్ నుంచి రోహిత్ శర్మ రెస్ట్ తీసుకున్నా, వన్డే వరల్డ్ కప్, ఆసియా కప్ 2023 టోర్నీలను దృష్టిలో ఉంచుకుని విరాట్ కోహ్లీకి టెస్టు, వన్డే టీమ్లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి..
ఐపీఎల్ 2023 సీజన్లో రెండు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో 639 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టీ20 ఫార్మాట్కి మాత్రం దూరంగా ఉండబోతున్నాడు. 2024 టీ20 వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ వంటి సీనియర్లను పొట్టి ఫార్మాట్కి దూరంగా పెడుతోంది బీసీసీఐ..