కరోనా బాధితుల కోసం రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ... అంతేకాకుండా...
కరోనా బాధితుల సహాయార్థం రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ...
నిధుల సేకరణ కోసం ఆన్లైన్ ద్వారా క్యాంపెయిన్ ప్రారంభించిన విరుష్క జోడి...
ఐపీఎల్ 2021 అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఇంటికి చేరిన భారత సారథి విరాట్ కోహ్లీ, వెంటనే కరోనా బాధితుల కోసం సహాయ కార్యక్రమాలు మొదలెట్టేశాడు. తన సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి కరోనా బాధితుల సహాయార్థం రూ.2 కోట్లు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించిన విరాట్ కోహ్లీ... ఫండ్ రైజింగ్ కోసం స్పెషల్ క్యాంపెయిన్ కోసం మొదలెట్టాడు.
‘దేశంలో పరిస్థితులు చాలా క్లిష్టంగా మారుతున్నాయి. కరోనా నుంచి కోలుకోవడానికి దేశం పోరాడుతోంది. జనాలు ఇలా ఇబ్బంది పడుతుంటే చూడడానికి చాలా కష్టంగా ఉంది.
మన కోసం రేయిపగళ్లు కష్టపడుతున్న మెడికల్ సిబ్బంది, ఫ్రంట్ లైన్ సిబ్బందికి ఏం చెప్పినా సరిపోదు. వారికి ఇప్పుడు మన మద్దతు కావాలి. అందుకే అనుష్క శర్మ, నేను... కెట్టోతో కలిసి ఈ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ మొదలెడుతున్నాం. ప్రతీ రూపాయి ఎంతో ఉపయోగపడుతుంది.
మనం కుటుంబం కోసం, స్నేహితుల కోసం కలిసి నడుద్దాం... కరోనా జయిద్దాం’ అంటూ వీడియో ద్వారా సందేశం తెలిపారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.