నామినేషన్ తిరస్కరణ... పంజాబ్ ప్రభుత్వంపై హర్భజన్ సీరియస్
టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ తన సొంత రాష్ట్రానికి చెందిన పంజాబ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. తమ ప్రభుత్వం చేసిన తప్పుకు తాను శిక్ష అనుభవించాల్సి వస్తోందని భజ్జీ ఆవేధన వ్యక్తం చేశాడు.
పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పుకు తాను శిక్ష అనుభవిస్తున్నానని టీమిండియా సీనియర్ ప్లేయర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. సొంత రాష్ట్రానికి చెందిన ఓ అంతర్జాతీయ క్రీడాకారుడి పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు అస్సలు బాగాలేదన్నాడు. ప్రభుత్వ అలసత్వం వల్లే తాను ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు దూరమవ్వాల్సి వచ్చిందని భజ్జీ ఆరోపించాడు.
''రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కు పంజాబ్ ప్రభుత్వం తన పేరును నామినేట్ చేశారు. అయితే అందుకు సంబంధించిన పత్రాలన్నింటిని తాను సకాలంలో సంబంధిత అధికారులకు సమర్పించాను. అయినప్పటికి కేంద్ర ప్రభుత్వం తన పేరును ఖేల్ రత్న అవార్డు కోసం పరిగణలోకి తీసుకోకుండా నామినేషన్ ను తిరస్కరింది. అలా ఎందుకు జరిగిందో నాకు అస్సలు అర్థం కాలేదు.
కానీ ఇటీవల కొన్ని మీడియా సంస్థల కథనం ద్వారా తన పేరు ఎందుకు తిరస్కరణకు గురయ్యిందో తెలిసింది. తాను సమర్పించిన పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా కేంద్రానికి అందించింది. అయితే అప్పటికే నామినేషన్ గడువు ముగియడంతో ఈ పత్రాలను కేంద్రం వెనక్కి పంపింది. ఇలా తమ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పుకు నేను ఓ అరుదైన అవార్డును అందుకునే అవకాశాన్ని కోల్పోయాను.
ఓ అంతర్జాతీయ క్రీడాకారుడి విషయంలోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తే సామాన్య క్రీడాకారుల పరిస్థితి ఏంటని అతడు ప్రశ్నించాడు. అందువల్ల దీన్ని సీరియస్ గా తీసుకుని నాకు అవార్డు రాకుండా చేసినవారిపై చర్యలు తీసుకోవాలని క్రీడా శాఖ మంత్రిని కోరుతున్నా. సమగ్ర విచారణ జరిపి జాప్యానికి కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని సూచించాడు. అప్పుడే ప్రభుత్వంపై నాతో పాటు ప్రజలకు నమ్మకం కలుగుతుంది.'' అంటూ హర్భజన్ పంజాబ్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యాడు.
అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను పెంచిన, అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టిన భారత క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం వివిధ పద్దతుల ద్వారా ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రతి ఏడాది క్రీడా అవార్డులను ప్రకటిస్తుంది. అయితే అందుకోసం వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారుల పేర్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కేంద్రానికి సిపార్సు చేస్తాయి. అలా ఈ ఏడాది కూడా క్రీడాకారుల వివరాలను పంపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. అందుకోసం ఓ గడువును విధించింది. ఆ గడువులోపు సరైన పత్రాలను పంపకపోవడంతో పంజాబ్ నుండి హర్భజన్ సింగ్, ఒడిషా నుండి ద్యుతి చంద్ పేర్లను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.