ఆసుపత్రిపాలైన టీమిండియా క్రికెటర్ ఖలీల్ అహ్మద్... క్రికెట్కి దూరంగా ఉండడం కష్టమంటూ...
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఖలీల్ అహ్మద్... రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో చాలా మ్యాచులకు దూరమవుతున్నానంటూ భావోద్వేగంగా ట్వీట్..
జహీర్ ఖాన్ రిటైర్మెంట్ తర్వాత అతని ప్లేస్ని రిప్లేస్ చేసే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కోసం చాలామంది యువ క్రికెటర్లను ప్రయత్నించింది భారత జట్టు. ఆ ప్రయత్నంలో టీమ్లోకి అలా వచ్చి ఇలా వెళ్లిన యంగ్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ ఒకడు.
2018లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ఖలీల్ అహ్మద్, టీమిండియా తరుపున 11 వన్డేలు, 14 టీ20 మ్యాచులు ఆడాడు. వన్డేల్లో 15, టీ20ల్లో 13 వికెట్లు తీసిన ఖలీల్ అహ్మద్, ధారాళంగా పరుగులు సమర్పించి తక్కువ సమయంలోనే టీమ్లో చోటు కోల్పోయాడు...
భారీగా పరుగులు సమర్పిస్తుండడంతో పాటు గాయాలు కూడా ఖలీల్ అహ్మద్ని టీమ్కి దూరం చేశాయి. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 2022 టోర్నీలో రాజస్థాన్ తరుపున ఆడిన ఖలీల్ అహ్మద్, ముంబైతో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లలో ఒకే వికెట్ తీసి 47 పరుగులు సమర్పించాడు.
ఈ మ్యాచ్ తర్వాత క్రికెట్కి దూరమైన ఖలీల్ అహ్మద్, విజయ్ హాజారే ట్రోఫీ 2022లో కూడా పాల్గొనలేదు. తాజాగా రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో కూడా ఖలీల్ అహ్మద్ ఆడడం అనుమానంగా మారింది.
‘డియర్ ఆల్... క్రికెట్కి దూరంగా ఉండడం చాలా కష్టమైన విషయం. అయితే తప్పడం లేదు. నా ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు, అందుకే రంజీ ట్రోఫీ సీజన్లో చాలా మ్యాచులకు దూరంగా ఉండబోతున్నా. అయితే నేను త్వరలోనే కోలుకుని, జట్టులోకి తిరిగి వస్తాయి... నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా...’ అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చాడు ఖలీల్ అహ్మద్..
ఐపీఎల్ 2022 సీజన్లో అనుకోకుండా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వెళ్లాడు ఖలీల్ అహ్మద్. ఐపీఎల్ 2022 సీజన్లో 10 మ్యాచులు ఆడి 16 వికెట్లు తీసి బాగానే ఆకట్టుకున్నా, గాయాలతో జట్టుకి పూర్తిగా అందుబాటులో ఉండలేకపోయాడు.
గతంలో సన్రైజర్స్ హైదరాబాద్కి ఆడిన పేసర్ ఖలీల్ అహ్మద్ కోసం ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్టు హోరాహోరీగా పోటీపడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని కిరణ్ కుమార్ గాంధీ, తన గుండు, ముఖంపై చిరునవ్వుతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు...
ఖలీల్ అహ్మద్ కోసం వేలం జరుగుతున్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.5 కోట్లకు బిడ్ వేసింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ 5.25 కోట్లకు బిడ్ వేసింది. ఆ వెంటనే బిడ్ వేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో కాస్త అయోమయానికి గురైన కిరణ్ కుమార్ గాంధీ, కార్డు పైకెత్తి మళ్లీ దించేశాడు...
అయితే ఈ అతి తెలివి కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ బిడ్ వేసిందని భావించాడు ఆక్షనర్ చారు శర్మ. అయితే బిడ్ అమౌంట్ మాత్రం ముంబై ఇండియన్స్ కోట్ చేసిన రూ.5.25 కోట్లుగానే చూపించింది బిగ్ స్క్రీన్...
దీంతో బిడ్ అమౌంట్ మరిచిపోయిన ఆక్షనీర్, ఢిల్లీ క్యాపిటల్స్కి రూ.5.25 కోట్లకే ఖలీల్ అహ్మద్ వెళ్తున్నట్టుగా ప్రకటించేశాడు. ఈ మొత్తాన్ని ముంబై ఇండియన్స్ టీమ్ సభ్యులు గమనిస్తూనే ఉన్నా, ఖలీల్ కోసం అంత మొత్తం చెల్లించడం వేస్ట్ అనే అభిప్రాయంతో సైలెంట్గా ఉండిపోయారు...
అయితే ఖలీల్ని మిస్ చేసుకున్న ముంబై ఇండియన్స్ 14 మ్యాచుల్లో 10 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ 7విజయాలు, 7 పరాజయాలతో ఐదో స్థానంలో నిలిచింది.