రేపే స్వదేశానికి రవిశాస్త్రి అండ్ కో... అయితే నెగిటివ్ రిజల్ట్ వస్తేనే, లేదంటే...
10రోజుల క్వారంటైన్ పీరియడ్ పూర్తిచేసుకున్న రవిశాస్త్రి, సహాయక సిబ్బంది... నెగిటివ్ రిజల్ట్ వస్తే బుధవారం స్వదేశానికి పయనం...
అప్పుడెప్పుడో ఐపీఎల్కి కరోనా కారణంగా సడెన్ బ్రేక్ పడిన తర్వాత జూన్ 2న ఇంగ్లాండ్ టూర్కి బయలుదేరింది టీమిండియా. భారత సారథి విరాట్ కోహ్లీ, హెడ్కోచ్ రవిశాస్త్రిలతో కూడిన బృందం... ఇంగ్లాండ్ టూర్లో ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు ఐదు టెస్టుల సిరీస్ ఆడాల్సింది. అయితే అనివార్య కారణాల వల్ల ఐదో టెస్టు రద్దు కావడంతో హనుమ విహారి మినహా మిగిలిన భారత క్రికెటర్లందరూ ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2 మ్యాచుల కోసం యూఏఈకి వెళ్లిపోయారు...
అయితే నాలుగో టెస్టు సమయంలో కరోనా పాజిటివ్గా తేలిన భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్లతో పాటు ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్, అలాగే అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మర్... ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ సిటీలోనే ఐసోలేషన్లో ఉన్నారు...
వీరి 10 రోజుల క్వారంటైన్ పీరియడ్, బుధవారంతో ముగియనుంది. బుధవారం మరోసారి వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ పరీక్షల్లో నెగిటివ్ రిజల్ట్ వస్తే... హెడ్ కోచ్ అండ్ కో స్వదేశానికి తిరిగి వస్తారు.. లేదంటే నెగిటివ్ రిజల్ట్ వచ్చేవరకూ ఐసోలేషన్లో గడపాల్సి ఉంటుంది...
ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్కప్ కోసం యూఏఈలో టీమిండియా క్యాంపులో కలుస్తారు. యూఏఈలో జరిగే టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీతో హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ల పదవీకాలం ముగియనుంది. రవిశాస్త్రిత పాటు వీరిద్దరూ కొనసాగేందుకు ఆసక్తి చూపించడం లేదని టాక్. అయితే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రం హెడ్కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నాడని సమాచారం..