Holi Celebrations in Team India: టీమిండియా సారథి రోహిత్ శర్మ గ్రౌండ్ లో గానీ పాత్రికేయుల సమావేశాల్లో గానీ చాలా కూల్ గా ఉంటాడు. కానీ నిన్న హోలీని పురస్కరించుకుని రోహిత్ అల్లరిపిల్లాడు అయిపోయాడు.
మంగళవారం దేశవ్యాప్తంగా హోలీ సంబురాలు అంబురాన్నంటాయి. ఇదే క్రమంలో భారత క్రికెట్ జట్టు కూడా హోలీ ఆడుతూ రచ్చ చేసింది. టీమిండియా క్రికెటర్లంతా హోలీ రంగుల్లో మునిగితేలారు. అహ్మదాబాద్ కు చేరుకున్న ఆటగాళ్లంతా.. హోటల్ తో పాటు బస్ లో హోలీని ఘనంగా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
టీమిండియా క్రికెటర్లు తాము హోలీ సెలబ్రేట్ చేసకున్న ఫోటోలు, వీడియోలను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాల్లో విడుదల చేసింది. ముందుగా టీమ్ ఉంటున్న హోటల్ లో సారథి రోహిత్ శర్మ భారత క్రికెట్ జట్టు కోచింగ్, సపోర్ట్, మేనేజ్మెంట్ స్టాఫ్ మెంబర్స్ కు రంగులు పూశాడు.
చిన్నపిల్లలు ఊరిలో ఆడుకున్నట్టే ప్రతీ ప్లేయర్ దగ్గరికి వెళ్లి రంగులు పూశాడు. సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ , ఛటేశ్వర్ పుజారా, శుభ్మన్ గిల్ లకు ముఖం నిండా రంగులు పూశాడు. అనంతరం బస్ లోకి ఎక్కగానే అక్కడ సిరాజ్, గిల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లకు రంగులు పూసిన రోహిత్..అక్కడే ఉన్న విరాట్ కోహ్లీని చూసి.. ‘విరాట్ ను వదలొద్దు..’ అని గట్టిగా అరుస్తూ అతడిపైనా రంగులు చల్లాడు. రంగు పూసుకోవడానికి జడేజా నిరాకరకించడంతో అతడిని దొరకబట్టి మరీ టీమ్ మెంబర్స్ రచ్చ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
బీసీసీఐతో పాటు టీమిండియా క్రికెటర్లు శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ లు కూడా తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో హోలి సెలబ్రేషన్స్ ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.
ఇక బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా తో ఇదిరవకే మూడు టెస్టులు ఆడిన భారత జట్టు.. 2-1 ఆధిక్యంలో నిలిచింది. నాగ్పూర్, ఢిల్లీలలో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్.. ఇండోర్ లో మాత్రం బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ లో గెలవడం భారత్ కు తప్పనిసరి అయింది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ చేజిక్కించుకోవడంతో పాటు వరల్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో కూడా భారత్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దీంతో నాలుగో టెస్టులో గెలిచేందుకు భారత్ వ్యూహాలు రచిస్తున్నది.
