TATA IPL: ప్రారంభ వేడుకల్లేవు.. కానీ వారికి ఘన సత్కారం.. తొలి మ్యాచుకు రానున్న ‘టోక్యో విజేత’లు
TATA IPL 2022: గతేడాది జపాన్ వేదికగా టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో భారత కీర్తి పతకాన్ని రెపరెపలాడించిన మన అథ్లెట్లను ఘనంగా సత్కరించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఐపీఎల్ లో సీఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచుకు ముందు....
శనివారం సాయంత్రం నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ లో ఈసారి కూడా ఆరంభ వేడుకల్లేకుండానే డైరెక్ట్ గా మ్యాచ్ మొదలుకానుంది. ప్రారంభ వేడుకల్లేకుండా ఐపీఎల్ మొదలుకావడం ఇది వరుసగా నాలుగోసారి. అయితే ఈసారి మాత్రం ఆరంభ వేడుకల్లేకున్నా టోక్యో ఒలింపిక్స్ లో భారత కీర్తి పతాకాన్ని రెపరెలాడించిన వీరులను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఘనంగా సత్కరించనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచుకు ముందు టోక్యోలో భారత్ కు పతకాలు సాధించిన వీరులను సత్కరించాలని బీసీసీఐ నిర్ణయించింది.
గతేడాది ఆగస్టులో టోక్యో వేదికగా ముగిసిన ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో లో స్వర్ణం సాధించిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రా తో పాటు రెజ్లర్లు బజరంగ్ పునియా, రవి దహియా.. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్, పీవీ సింధు, భారత పురుషుల హాకీ జట్టు సభ్యులను సత్కరించాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఈ మేరకు ఇప్పటికే ఒలింపిక్ విజేతలకు ఆహ్వానాలను పంపింది బీసీసీఐ. అయితే ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు నీరజ్ చోప్రా తో పాటు బజరంగ్ పునియా, రవి దహియా, లవ్లీనా, భారత హకీ జట్టు (పురుషులు, మహిళలు) కు చెందిన సభ్యులు కొంతమంది వాంఖెడేకు వచ్చే అవకాశముంది. ఒలింపిక్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా కు సత్కారంతో పాటు కోటి రూపాయల నజారానా కూడా ప్రకటించింది బీసీసీఐ. టోక్యో ఒలింపిక్స్ లో పైన పేర్కొన్న ఆటగాళ్లు ఆరు మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ ప్రారంభ వేడుకలు ఎందుకు లేవు..?
2018 వరకు ప్రతి ఏడాది ఐపీఎల్ ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగేవి. కానీ తర్వాత ఏడాది నుంచి వీటిని పలు కారణాల వల్ల వీటిని నిర్వహించడం లేదు. 2019 లో భారత సైనికుల మీద ఉగ్రవాదులు జరిపిన పూల్వామా మారణకాండ నేపథ్యంలో ఐపీఎల్ వేడుకలు రద్దు చేశారు. ఇక 2020, 2021లో కరోనా కారణంగా బీసీసీఐ వీటి జోలికి పోలేదు. ఇక ఈ ఏడాది కూడా అదే పద్ధతి పాటిస్తున్నారు.
ఐపీఎల్ ఆరంభ వేడుకలకు కళ్లు జిగేల్ మనిపించే లైట్లు, బాలీవుడ్ తారల ఆట పాటలు, సంగీత దర్శకుల ప్రదర్శనలతో అదంతా ఓ పండుగలా ఉండేది. దీనికి ఎంతలేదన్నా బీసీసీఐకి రూ. 40 కోట్ల నుంచి రూ. 45 కోట్ల వరకు ఖర్చయ్యేది. అయితే 2019 నుంచి ఈ వేడుకలను నిర్వహించకపోవడంతో ఆ డబ్బు కూడా బీసీసీఐకి కలిసివస్తున్నది.