Aramco Deals With BCCI: ఐపీఎల్ ఇక ఎంతమాత్రమూ భారతదేశానికే పరిమితం కాదన్న బీసీసీఐ పెద్దల మాటలు రుజువవుతున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం ఈ క్యాష్ రిచ్ లీగ్ లో కనబడేందుకు భారీ డీల్స్ ను కుదుర్చుకుంటున్నాయి. ప్రపంచంలో ఆపిల్ తర్వాత అతి పెద్ద సంస్థ అయిన సౌదీ అరేబియా ఆయిల్ దిగ్గజం ‘ఆరామ్కో’ ఐపీఎల్ తో జతకట్టింది.
కొద్దిరోజుల క్రితం బీసీసీఐ స్పాన్సర్షిప్ నకు సంబంధించి జరిగిన చర్చపై ఓ మార్కెట్ అనలిస్టు మాట్లాడుతూ.. ‘మా వస్తువులు మార్కెట్ కావాలంటే మేం ఐపీఎల్ లో కనబడాల్సిందే. ఐపీఎల్ లో కనిపించకుంటే మా ఉత్పత్తులు ఎక్కడా కనిపించే పరిస్థితుల్లేవు..’ అని వ్యాఖ్యానించాడు. అదే మాటను నిజం చేస్తూ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకునే సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ క్రూడ్ ఆయిల్ సంస్థ ‘ఆరామ్కో’ కూడా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుతో జతకట్టింది. ఐపీఎల్ లో ఆరామ్కో కూడా ఒక స్పాన్సర్ గా చేరింది. ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్లు తీసే బౌలర్ కు ఇచ్చే పర్పుల్ క్యాప్ ల మీద ఇకనుంచి ఆరామ్కో లోగోలు కనిపించనున్నాయి. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లకు కూడా స్పాన్సర్లుగా వ్యవహరించడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ మేరకు ఆరామ్కో ప్రతినిధులు బీసీసీఐ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తున్నది. యేటా రూ. 65 కోట్లతో ఈ ఒప్పందం కుదిరినట్టు సమాచారం. అయితే ఎన్నాళ్లకు ఈ డీల్ కుదిరిందన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఒప్పందంతో ఆరామ్కో ఐపీఎల్ లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లకు అధికారిక స్పాన్సర్ గా వ్యవహరించనుంది.
బీసీసీఐకి ఈ ఐపీఎల్ లో మునుపెన్నడూ లేనంతగా స్సాన్సర్షిప్స్ వస్తున్నాయి. ఒక్క స్పాన్సర్షిప్స్ ద్వారానే బీసీసీఐ కి ఈ ఏడాది వేయి కోట్ల రూపాయల మేరకు ఆదాయం సమకూరినట్టు స్వయంగా బీసీసీఐ కార్యదర్శి జై షా తెలపడం విశేషం. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో రూపే తో పాటు స్విగ్గీ లతో కుదుర్చుకున్న ఒప్పందాలను బీసీసీఐ ఆమోదించింది.
ఈ సందర్భంగా జై షా మాట్లాడుతూ.. ‘ఇది స్పష్టంగా ఐపీఎల్ బ్రాండ్ విలువను తెలుపుతున్నది. కొత్త స్పాన్సర్లు మాతో జతకట్టడంపై మాకెంతో సంతోషాన్నిచ్చింది. ఈ ఏడాది మాకు ఐపీఎల్ లో మునుపెన్నడూ లేనంతగా స్పాన్సర్షిప్ ల ద్వారా ఆదాయం సమకూరింది. రికార్డు స్థాయిలో ఆ విలువ రూ. 1000 కోట్ల పైనే ఉంటుంది..’ అని తెలిపాడు.
కాగా.. గతంలో లేనంతగా ఈసారి ఐపీఎల్ కు ఆరు సంస్థలు అఫిషియల్ స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్నాయి. ఐపీఎల్ సెంట్రల్ స్పాన్సర్షిప్ చేస్తున్న సంస్థలేవో ఇక్కడ చూద్దాం.
ఐపీఎల్ 2022 సెంట్రల్ స్పాన్సర్స్ :
- టాటా : టైటిల్ స్పాన్సర్
- డ్రీమ్ 11 : అఫిషియల్ పార్ట్నర్
- అన్ అకాడెమీ : అఫిషియల్ పార్ట్నర్
- క్రెడ్ : అఫిషియల్ పార్ట్నర్
- అప్స్టాక్స్ : అఫిషియల్ పార్ట్నర్
- స్విగ్గీ ఇన్స్టాంట్ : అఫిషియల్ పార్ట్నర్
- పేటీఎం : అఫిషియల్ అంపైర్ పార్ట్నర్
- సీయట్ : అఫిషియల్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్ట్నర్
- ఆరామ్కో : ఆరెంజ్, పర్పుల్ క్యాప్ స్పాన్సర్స్ (అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది)
టైటిల్ స్పాన్సర్షిప్ (టాటా) ద్వారా ఏటా రూ. 400 కోట్లకు పైగా పొందుతున్న బీసీసీఐ.. మిగిలిన స్పాన్సర్ల ద్వారా రూ. 1000 కోట్ల ఆదాయం మార్క్ ను చేరుకున్నది.
