TATA IPL 2022: మనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి నుంచి చిన్న బహుమతి వచ్చినా మనం ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతాం. అలాంటిది మనం ఆరాధించే వ్యక్తి.. మన ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం అందిస్తే.... ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ అదే ఫీల్ లో ఉన్నాడు.
మరికొద్దిగంటల్లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఐపీఎల్-15 సీజన్ తొలి మ్యాచుకు సిద్ధమవుతున్న కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ కు ఊహించని బహుమతి దక్కింది. అతడు ఎంతగానో ఆరాధించే వ్యక్తి నుంచి అయ్యర్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో మెసేజ్ వచ్చింది. ఆ సందేశం చూసిన వెంకటేశ్.. తనకు బూస్టర్ డోస్ ఇచ్చినంత హ్యాప్పీగా ఫీలవుతున్నాడు. ఇంతకీ వెంకటేశ్ అయ్యర్ కు అంతగా కిక్కిచ్చిన మెసేజ్ ఏంటి..? అది పంపిందెవరు..? ఆ కథాకమామీషేంటో ఇక్కడ చూద్దాం.
కేకేఆర్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ కు డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ సేత్ రోలిన్స్ అంటే పిచ్చి. గతంలో పలు ఇంటర్వ్యూలలో కూడా అయ్యర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. తాను రోలిన్స్ కు వీరాభిమానినని, అతడు ప్రత్యర్థులతో తలపడే మ్యాచులన్నీ తాను చూస్తానని అతడు చెప్పాడు.
అయితే ఈ విషయం తెలుసుకున్న రోలిన్స్.. అభిమాని కోసం ఓ ప్రత్యేక వీడియో సందేశం పంపాడు. వీడియోలో ‘వెంకటేశ్, మై ఫ్రెండ్.. నేను సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్. నువ్వు ను అభిమాని కావడంలో ఆశ్చర్యం లేదు. మై డియర్ ఫ్రెండ్, నీ ముందు ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉంది. ఈ టోర్నీలో నువ్వు రాణించి, నీ జట్టుకు కప్ అందించడానికి సిద్ధంగా ఉండు.. కష్టపడి ఆడు...’ అని చెప్పుకొచ్చాడు. రోలిన్స్ గతంలో డీన్ఆంబ్రోస్, రోమన్ రెయిన్స్తో కలిసి షీల్డ్ గ్రూప్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల దగ్గరయ్యాడు.
ఈ వీడియోనుు డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. సోషల్ మీడియలో పోస్ట్ చేయగానే లక్షలాది లైకులు, వేలాది షేర్లతో దూసుకుపోతుంది. సీఎస్కేతో మ్యాచుకు ముందు రోలిన్స్ పంపిన ఈ వీడియో సందేశం అయ్యర్ కు కిక్కిచ్చేదే అని చెప్పాలి. ఇది చూసిన అయ్యర్ మరింత చెలరేగుతాడని చెప్పడంలో సందేహమే లేదు.
కాగా.. గత సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్స్ కు వెళ్లడంలో వెంకటేశ్ అయ్యర్ దే కీలక పాత్ర. ఐపీఎల్-14 సీజన్ తొలి దశలో పెద్దగా ఆకట్టుకోని కేకేఆర్.. దుబాయ్ లో జరిగిన రెండో దశలో మాత్రం అదరగొట్టింది. రెండో దశలో అనూహ్యంగా ఓపెనర్ గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్.. 10 మ్యాచులలో 41.11 సగటుతో 370 పరుగులు చేశాడు. ఫైనల్ లో కేకేఆర్ ఓడినా.. అయ్యర్ మాత్రం ఈ ప్రదర్శనలతో భారత జట్టులో స్థానం సంపాదించాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయగల సమర్థుడు అయ్యర్. ఈ ఐపీఎల్ లో రాణించి భారత జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని అతడు భావిస్తున్నాడు.
నేటి సాయంత్రం 7.30 గంటలకు వాంఖెడే వేదికగా ప్రారంభం కాబోయే మ్యాచులో కేకేఆర్, సీఎస్కే తలపడనున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో ఇరు జట్లు 26 సార్లు తలపడగా.. అందులో సీఎస్కే 17 సార్లు, కేకేఆర్ 8 సార్లు గెలిచాయి. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. మరి నేటి మ్యాచులో విజయం ఎవరిని వరించుతుందో చూసేందుకు అభిమానులతో పాటు ఇరు జట్ల ఆటగాళ్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
