Asianet News TeluguAsianet News Telugu

‘‘ ఆ 82 కాదు.. ఈ 82 బెస్ట్ ’’ , పాక్‌పై ఇన్నింగ్స్‌‌కు కెరీర్ టాప్ రేటింగ్ ఇచ్చిన కోహ్లీ

ఐసీసీ టీ 20 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించాడు. 82 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో పాటు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

t20 world cup : Virat Kohli Rates Knock vs Pak His Best
Author
First Published Oct 23, 2022, 8:22 PM IST

ఆదివారం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐసీసీ టీ 20 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో పాటు పాకిస్తాన్‌పై అద్భుతమైన విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. పాక్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (4), రోహిత్ శర్మ (4) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

దీంతో ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టేందుకు గాను కోహ్లీ ఆచితూచి ఆడాడు. సూర్య కుమార్ యాదవ్ (15), అక్షర్ పటేల్ (2) కూడా వెంట వెంటనే పెవిలియన్ చేరడంతో భారత్ కష్టాలు రెట్టింపయ్యాయి. అయితే హార్డిక్ పాండ్యాతో (40) కలిసి విరాట్ కోహ్లీ టీమిండియాను కష్టాల నుంచి గట్టెక్కించాడు. వీరిద్దరూ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పాటు భారత్ ఆశలను సజీవంగా వుంచారు. డెత్ ఓవర్లలో క్లాస్ టచ్ ఇచ్చాడు.. పాక్ పేస్ ద్వయం షాహీన్ ఆఫ్రిది, హరీస్ రౌఫ్‌ల బౌలింగ్‌లో విధ్వంసం సృష్టించాడు . అయితే ఆఖరి ఓవర్‌లో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. కానీ మహ్మద్ నవాజ్ నో బాల్ వేయడం పాక్‌ను చావు దెబ్బ తీసింది. 

మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఇవాళ్టీ ఇన్నింగ్స్‌ తను టీ20లలో అత్యుత్తమైనదిగా రేటింగ్ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే తనకు మాటలు రావడం లేదని.. ఇది ఎలా జరిగిందో కూడా తెలియడం లేదన్నారు. చివరి వరకు నమ్మకంతో వుండాలని హార్డిక్ తనతో ముందు నుంచి చెబుతూనే వున్నాడని.. కోహ్లీ అన్నారు. చివరి వరకు క్రీజ్‌లో వుంటే విజయం సాధ్యమనే తాము అనుకున్నామని.. ముఖ్యంగా షాహీన్ ఆఫ్రిదిని టార్గెట్ చేయాలని తాను , హార్డిక్ అనుకున్నామని విరాట్ చెప్పాడు. 

ALso REad:పాక్‌పై విజయం : కన్నీటి పర్యంతమైన విరాట్ కోహ్లీ, భుజానికెత్తుకున్న రోహిత్

అలాగే హారిస్ రవుఫ్ పాక్ ప్రధాన బౌలర్ కావడంతో.. అతనిపైనా దాడికి దిగాలని , తద్వారా పాకిస్తాన్ ఒత్తిడికి గురవుతుందనే వ్యూహంతో ఆడినట్లు తెలిపాడు. 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి వచ్చినప్పుడు వెంట వెంటనే రెండు సిక్సర్లు బాదడంతో సమీకరణం తేలికైందని కోహ్లీ అన్నాడు. ఇప్పటివరకు మొహాలీ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా మీద ఆడిన ఇన్సింగ్ తన కెరీర్ అత్యుత్తమంగా వుండేదని, ఇప్పుడు ఈ జాబితాలోకి పాకిస్తాన్‌పై ఇన్నింగ్స్ వచ్చి చేరిందని ఆయన తెలిపారు. తాను తన బ్యాట్‌ను బాల్ లైన్ గుండా తిప్పి.. ఫైన్ లెగ్ మీదుగా సిక్స్ కొట్టానని, ఇది చాలా ప్రత్యేకమైన క్షణమని కోహ్లీ అభివర్ణించారు. 

ఇకపోతే.. తన ఆటతీరుతో మెల్‌బోర్న్ స్టేడియంలో ప్రత్యక్షంగా వున్న 90 వేల మంది క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న అభిమానులను అలరించాడు కోహ్లీ. ఇన్నింగ్స్ ముగిసి భారత్ విక్టరీ సాధించగానే గ్రౌండ్‌లో నిలబడిన కోహ్లీకి క్రికెటర్లు, అభిమానులు చప్పట్లతో అభినందించారు. వారి మద్ధతుతో ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు. కోహ్లీ.. కోహ్ల అనే నినాదాలు ఎంసీజీలో మారుమోగాయి. 

అంతేకాదు.. ఈ అద్బుత క్షణంలో కోహ్లీని కెప్టెన్ రోహిత్ శర్మ తన భుజాలపైకి ఎత్తుకుని తిప్పేశాడు. అంతేకాదు.. ఇద్దరు కలిసి గ్రౌండ్‌లో పరుగులు తీస్తూ సంబరాలు జరుపుకున్నారు. జట్టు సభ్యులు అశ్విన్, హార్డిక్ పాండ్యా సహా ఇతర సహచరులు కోహ్లీని ఆలింగనం చేసుకుని అభినందించారు. ఈ సంఘటనలతో ఆయన మ్యాన్ ఆఫ్ ది మూమెంట్‌గా నిలిచాడు. భారత్ - పాక్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో మరుపురాని మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios