Asianet News TeluguAsianet News Telugu

టీ20 వరల్డ్ కప్ 2022: జింబాబ్వేపై ఘన విజయం... టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్‌కి టీమిండియా... 

115 పరుగులకి ఆలౌట్ అయిన జింబాబ్వే... 71 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న టీమిండియా... 3 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్... 

T20 World cup 2022: Team India beats Zimbabwe are ready to play semi-final with England
Author
First Published Nov 6, 2022, 4:52 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వేపై భారీ విజయం అందుకుని, గ్రూప్ మ్యాచులను ముగించింది టీమిండియా. 8 పాయింట్లతో గ్రూప్ 2 టేబుల్ టాపర్‌గా భారత జట్టు... నవంబర్ 10న రెండో సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో తలబడనుంది.  187 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన జింబాబ్బే 17.2 ఓవర్లలో 115 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 

187 పరుగుల భారీ లక్ష్యఛేదనలో మొదటి బంతికి జింబాబ్వేకి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే వెస్లీ వెదేవేర్, కోహ్లీకి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. రెగిస్ చకబ్వాని అర్ష్‌దీప్ సింగ్ డకౌట్ చేశాడు. 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది జింబాబ్వే...

18 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన సాన్ విలియమ్స్, షమీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 15 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన క్రెగ్ ఎర్వీన్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టోనీ మున్యోంగ 5 పరుగులు చేసి అవుట్ కావడంతో 36 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది జింబాబ్వే...

22 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసిన రియాన్ బర్ల్‌ని అవుట్ చేసిన అశ్విన్, మసకడ్జ, నగరవా వికెట్లు తీశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసిన సికందర్ రజా 24 బంతుల్లో 3 ఫోర్లతో 34 పరుగులు చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా... నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.  

టోర్నీలో వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ 13 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ కలిసి రెండో వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 25 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, సీన్ విలియమ్స్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు...

టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో 246 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా టాప్‌లో నిలిచాడు. విరాట్ కోహ్లీ 5 మ్యాచుల్లో ఈ ఫీట్ అందుకుంటే ఆ తర్వాతి నాలుగు స్థానాల్లో క్వాలిఫైయర్ మ్యాచులతో సహా 8 మ్యాచులు ఆడిన ప్లేయర్లు మ్యాక్స్ ఓడాడ్, కుశాల్ మెండిస్, పథుమ్ నిశ్శంక, లోర్కన్ టక్కర్ ఉన్నారు.. 

దినేశ్ కార్తీక్ ప్లేస్‌లో టీమ్‌లో చోటు దక్కించుకున్న రిషబ్ పంత్ 5 బంతుల్లో 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, సికందర్ రజా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

మొదటి మూడు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరిన కెఎల్ రాహుల్, వరుసగా రెండు మ్యాచుల్లో 50+ స్కోర్లు నమోదు చేయడం విశేషం. 

బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, ఈ ఏడాది టీ20ల్లో 1000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 

15 ఓవర్లు ముగిసే సమయానికి 107 పరుగులే చేసింది టీమిండియా. ముజరబానీ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్, పాండ్యా కలిసి 4 ఫోర్లతో 18 పరుగులు రాబట్టారు.  ఆ తర్వాతి ఓవర్‌లో 12 పరుగులు రాగా 18వ ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి. 

18 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న సూర్యకుమార్ యాదవ్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో మూడో 50+ స్కోరు నమోదు చేశాడు. 

ఆఖరి ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 21 పరుగులు రాబట్టిన సూర్యకుమార్ యాదవ్, టీమిండియాకి భారీ స్కోరు అందించాడు. ఆఖరి 5 ఓవర్లలో 79 పరుగులు చేసింది టీమిండియా. సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios