క్రీడాకారులూ సుశాంత్ అభిమానులే.. వెండితెర ధోని మరణంతో షాక్లో క్రికెట్ ప్రపంచం
సినీ రంగానికి ఏమాత్రం సంబంధం లేని క్రికెటర్లు కూడా సుశాంత్ ఆత్మహత్యతో దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనికి కారణం.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్లో ఆయన నటించడమే
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు పాల్పడటంతో భారతీయ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఈ వార్త తెలిసి ఉలిక్కిపడ్డారు. సోషల్ మీడియా ద్వారా సినీ రంగ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.
అయితే సినీ రంగానికి ఏమాత్రం సంబంధం లేని క్రికెటర్లు కూడా సుశాంత్ ఆత్మహత్యతో దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనికి కారణం.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్లో ఆయన నటించడమే. ఈ పాత్ర ద్వారా క్రికెట్ అభిమానులకు సుశాంత్ ఫేవరేట్గా మారిపోయారు. అతని అకాల మరణంతో ధోనీ ఫ్యాన్స్ దు:ఖ సాగరంలో మునిగిపోయారు.
అద్బుత నైపుణ్యం కలిగిన యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం షాక్కు గురిచేసిందని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. అతని కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
జీవితమంటే చాలా సున్నితమైపోయిందని.. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదని కాస్త దయగా ఉండాలంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు
ఈ వార్త అబద్ధమని ఎవరైనా చెప్పండి.. సుశాంత్ ఇక లేడనే వార్తను నమ్మలేకపోతున్నా.. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి అని హర్భజన్ ట్వీట్ చేశారు
సుశాంత్ మరణ వార్త షాక్కు గురిచేసిందని, ధోనీ బయోపిక్ సందర్భంగా ఎన్నోసార్లు అతనిని కలిసానని ఓ అందగాడిని కోల్పోయానని సురేశ్ రైనా ట్వీట్ చేశాడు. ఎప్పుడూ నవ్వుతూనే ఉండే నటుడని ఆయన అన్నాడు.
సుశాంత్ ఆత్మహత్య వార్త విని తాను చాలా షాక్కు గురయ్యానని ఇర్పాన్ పఠాన్ ట్వీట్ చేశాడు
సుశాంత్ మనల్ని చాలా త్వరగా వీడి వెళ్లారు. అటువుంటి యువ ప్రతిభావంతుడైన నటుడిని, మంచి మనిషిని కోల్పోవడం నిజంగా బాధాకరమని సైనా నెహ్వాల్ ట్వీట్ చేశారు