Virat Kohli: కోహ్లి.. నిన్నిలా చూడలేం..! గ్రౌండ్ లో ఏడ్చేసిన విరాట్.. వీడియో వైరల్
IPL2021: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా సోమవారం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లి సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ టోర్నీతో ఆర్సీబీ నాయకుడిగా నిష్క్రమించనున్న కోహ్లికి ఈ ఓటమితో కన్నీళ్లు ఆగలేదు.
తొలి IPL టైటిల్ కొట్టాలని భావించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆశలు అడియాసలే అయ్యాయి. సోమవారం Kolkata Knight Ridersతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఆ జట్టు అనూహ్యంగా ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీనిని RCB ఫ్యాన్స్ తో పాటు ఆ జట్టు ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సీజన్ తర్వాత బెంగళూరు కెప్టెన్ గా వైదొలగనున్న Virat Kohli అయితే గ్రౌండ్ లోనే కన్నీటి పర్యంతమయ్యాడు. అతడితో పాటు డివిలియర్స్, మహ్మద్ సిరాజ్ లు బోరుమని ఏడ్చేశారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఆన్ ది ఫీల్డ్ లోనే గాక ఆఫ్ ది ఫీల్డ్ లోనూ అగ్రెసివ్ గా ఉండే కోహ్లి.. గ్రౌండ్ లో ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేడు. అయితే దూకుడుగా ఉన్నా అతడెప్పుడూ మ్యాచ్ ఓడిపోయినాక ఏడిచిన దాఖలాల్లేవు. ముఖం దిగాలుగా ఉండటం చూశాం కానీ బోరుమని ఏడ్చిన సందర్భాలు చాలా తక్కువ. కానీ నిన్నటి మ్యాచ్ అనంతరం కోహ్లి.. తన బాధను దాచుకోలేకపోయాడు.
కెప్టెన్ గా Royal challengers Bangloreకి కప్పు అందించలేకపోయానన్న బాధో లేక మరేంటో గానీ మ్యాచ్ ఓడిపోయాక విరాట్ కంటి వెంట కన్నీళ్లు ఆగలేదు. అతడి ముఖంలో నవ్వు మాయమైంది. విరాట్ తో పాటు విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ కూడా ఏడ్చేశాడు. ఇక కోహ్లికి సాన్నిహిత్యంగా ఉండే ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా తన ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు.
కోహ్లి కోసమైనా కప్పు గెలుస్తామన్న ఆర్సీబీ ఆటగాళ్లు తమ మాటను నిలబెట్టుకోలేకపోయారు. దీంతో మ్యాచ్ అయిపోగానే వారి ముఖాల్లో నిర్వేదం కనిపించింది. ఒక్క ఆటగాడి ముఖంలోనూ నవ్వు కనిపించలేదు.
2013లో ఆర్సీబీ పగ్గాలు అందుకున్న కోహ్లి.. 140 మ్యాచ్ లలో ఆ జట్టుకు నాయకుడిగా వ్యవహరించాడు. అందులో 66 విజయాలు.. 70 పరాజయాలున్నాయి. నాలుగింటిలో ఫలితం తేలలేదు. కోహ్లి సారథ్యంలో.. 2016 సీజన్ లో బెంగళూరు రన్నరప్ గా నిలిచింది. మూడు సార్లు ప్లేఆఫ్స్ చేరింది. బెంగళూరు సారథిగా విరాట్ విఫలమయ్యాడేమో గానీ ఆటగాడిగా మాత్రం తనలోని అత్యద్భుత ఆటతీరుతో అభిమానులను అలరించాడు.
కాగా, నిన్నటి మ్యాచ్ లో టాస్ గెలిచిన కోహ్లి.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక్కడే బెంగళూరు ఓటమికి బీజం పడిందని చాలా మంది అనుకుంటున్నారు. ఈ సీజన్ లో టాస్ గెలిచిన ఏ కెప్టెన్ కూడా తొలుత బ్యాటింగ్ ఎంచుకోలేదు. అయితే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ.. 138 పరుగులు చేసింది. అనంతరం 139 పరుగుల లక్ష్య ఛేదనతో ఇన్నింగ్స్ ప్రారంభించిన కోల్కతా.. 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.