India Vs west Indies 2nd ODI:  టీమిండిాయా మాజీ సారథి ఎంఎస్ ధోని  తనమీద చేసిన ప్రయోగాన్ని ఇప్పుడు హిట్ మ్యాన్.. రిషభ్ పంత్ మీద ప్రయోగించాడు. కానీ...  

పరిమిత ఓవర్లలో ఇటీవలే సారథ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. వెస్టిండీస్ తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో తన మాజీ సారథి ఎంఎస్ ధోని చేసిన ప్రయోగాన్ని చేశాడు. అయితే ఈ ప్రయోగంలో ధోని సఫలం కాగా.. హిట్ మ్యాన్ మాత్రం (ఇప్పటికైతే) విఫలమయ్యాడు. టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ను తనతో పాటు ఓపెనింగ్ జోడీగా తీసుకువచ్చాడు. కుడి, ఎడమ చేతి వాటం బ్యాటర్ల కలయిక కోసం వేచి చూస్తున్న భారత జట్టు.. విండీస్ తో వన్డే సిరీస్ లో దానిని ప్రయోగించింది. 

2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రస్తుత సారథి రోహిత్ శర్మ.. జట్టులోకి రావడం, వెళ్లడం.. ఒకవేళ నిలకడగా ఉన్నా ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనే విషయమ్మీద క్లారిటీ లేకపోయేది. జట్టు అవసరాలను బట్టి అతడిని ఎక్కడపడితే అక్కడ బ్యాటింగ్ కు పంపించేది మేనేజ్మెంట్. కానీ రోహిత్ శర్మ కెరీర్ ను ధోని మలుపుతిప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధావన్ తో కలిసి రోహిత్ శర్మ ను ఓపెనింగ్ కు పంపాడు. ఆ ట్రోఫీలో ఈ జంట సూపర్ సక్సెస్ అయింది. ఇక తర్వాత అంతా చరిత్రే.. 

Scroll to load tweet…

ఇప్పుడు అదే ఫార్ములా ను హిట్ మ్యాన్ ఫాలో అయ్యాడు. శిఖర్ ధావన్ ఫామ్ కోల్పోవడంతో భారత్ కు రోహిత్ శర్మతో పాటుగా ఇన్నింగ్స్ ఆరంభించే లెఫ్ట్ హ్యాండర్ దొరకలేదు. దీంతో కెఎల్ రాహుల్ నే ఓపెనింగ్ గా పంపింది జట్టు యాజమాన్యం. ఓపెనర్ నుంచి ఆరోస్థానం దాకా బ్యాటింగ్ చేయగల సమర్థుడు రాహుల్ ఉన్నా జట్టు యాజమాన్యం మాత్రం రైట్ హ్యాండ్-లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ను సెట్ చేయాలని భావిస్తున్నది. 

హిట్ మ్యాన్ కు ఓ ఆప్షన్..?

అయితే హిట్ మ్యాన్ కు పంత్ రూపంలో ఒక ఆప్షన్ కనిపించింది. ఆ ప్రయోగం విజయవంతమవుతుందా..? లేదా..? అనే విషయం పక్కనబెడితే ముందైతే పరీక్షించిచూడటంలో తప్పులేదు కదా..? అనే భావనలో ఉన్న హిట్ మ్యాన్.. రెండో వన్డేలో తనతో పాటు పంత్ ను కూడా తీసుకొచ్చాడు. పంత్ కూడా దూకుడుగా ఆడటంలో దిట్ట. ఆదినుంచే ప్రత్యర్థి జట్టుమీద ఆధిపత్యం చెలాయించాలంటే అగ్రెసివ్ ఆటతోనే ముందుకెళ్లాలి. అది పంత్ లో పుష్కలంగా ఉంది. 

Scroll to load tweet…

ఇక రెండో వన్డేలో హిట్ మ్యాన్ తో బ్యాటింగ్ కు వచ్చిన పంత్.. మూడు ఫోర్లు కొట్టి క్రీజులో నిలదొక్కుకున్నట్టే కనిపించాడు. 34 బంతుల్లో 18 పరుగులు చేశాడు. కానీ ఓడెన్ స్మిత్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి జేసన్ హోల్డర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

పంత్ గతంలో కూడా.. 

గతంలో అండర్-19 క్రికెట్ ఆడినప్పుడు పంత్ ఓపెనర్ గానే బరిలోకి దిగేవాడు. అండర్-19లో 11 మ్యాచుల్లో ఓపెనర్ గా వచ్చిన పంత్.. 454 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఐపీఎల్ లో కూడా పంత్ నాలుగు సార్లు ఓపెనర్ గా వచ్చాడు. నాలుగు మ్యాచులలో 106 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో ఓపెనర్ గా అతడి సగటు 26.00 గా ఉంది. 

మరో ఆప్షన్ కూడా ఉంది.. 

అయితే అంతర్జాతీయ కెరీర్ లో పంత్ కు ఓపెనర్ గా ఇదే తొలి మ్యాచ్. మరి తర్వాత మ్యాచులలో కూడా హిట్ మ్యాన్ ఇదే ఫార్ములాను కొనసాగిస్తాడా..? లేదా..? అనేది ఆసక్తికరం గా మారింది. ఒకవేళ హిట్ మ్యాన్ మాత్రం ఇదే ఫార్ములా తో ఉండి పంత్ సక్సెస్ అయితే భారత్ కు మేలే. పంత్ విఫలమైనా ఇషాన్ కిషన్ రూపంలో కూడా హిట్ మ్యాన్ కు మరో ఆప్షన్ కూడా ఉంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్, వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఈ ప్రయోగాలు అందుకు దోహదం చేసేవే.. ఇక రెండో వన్డేలో రోహిత్ తో పాటు పంత్ కూడా క్రీజులోకి రాగానే సోషల్ మీడియా కూడా స్పందించింది. హిట్ మ్యాన్ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడని పోస్టులు వెల్లువెత్తాయి. 

ఇదిలాఉండగా.. వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా 25 ఓవర్లు ముగిసేసరికి 3 కీలక వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (5), రిషభ్ పంత్ (18), విరాట్ కోహ్లి (18) వెంటవెంటనే నిష్క్రమించారు. కెఎల్ రాహుల్ (32 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (24 నాటౌట్) మరో వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు.