Republic Day 2022: మోడీ మెసేజ్ తోనే నిద్ర లేచా.. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు : యూనివర్సల్ బాస్
PM Modi Messaged Chris Gayle and Jonty Rhodes: భారత ప్రధాని నరేంద్ర మోడీ తనకు మెసేజ్ చేశారని, ఆయన పంపిన సందేశంతోనే తాను నిద్ర లేచానని కరేబియన్ వీరుడు పేర్కొన్నాడు.. భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడు. గేల్ తో పాటు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ కు కూడా మోడీ గణతంత్ర దినోత్సవ సందేశం పంపారు.
విండీస్ విధ్వంసకర ఆటగాడు, తనను తాను యూనివర్సల్ బాస్ గా అభివర్ణించుకున్న క్రిస్ గేల్ భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. భారత్ అన్నా, ఇక్కడి ఆటగాళ్లు, ప్రజలు అన్నా ఈ కరేబియన్ వీరుడికి ప్రత్యేక అభిమానం. ఈ విషయాన్ని గతంలో పలుమార్లు వెల్లడించిన గేల్.. తాజాగా భారత్ పై మరోసారి అభిమానాన్ని చాటుకున్నాడు. ఈరోజు (బుధవారం) ఉదయం భారత ప్రధాని నరేంద్ర మోడీ తనకు మెసేజ్ చేశారని, ఆయన పంపిన సందేశంతోనే తాను నిద్ర లేచానని గేల్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా 73వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారత్ కు శుభాకాంక్షలు తెలిపాడు.
ట్విట్టర్ వేదికగా స్పందించిన గేల్... ‘73 వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఇండియాకు శుభాకాంక్షలు. ఈరోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ పంపిన వ్యక్తిగత సందేశం (పర్సనల్ మెసేజ్) తోనే నిద్ర లేచాను. మోడీతో పాటు భారతీయులతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. యూనివర్సల్ బాస్ నుంచి శుభాకాంక్షల...’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు. గతంలో విండీస్ దీవులకు భారత్ కరోనా వ్యాక్సిన్లను పంపినప్పుడు కూడా గేల్.. మోడీకి కృతజ్ఞతలు చెప్పిన విషయం తెలిసిందే.
గేల్ తో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, దిగ్గజ ఫీల్డర్ జాంటీ రోడ్స్ కు కూడా మోడీ ఓ లేఖ రాశారు. జాంటీ రోడ్స్ కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన మోడీ.. దక్షిణాఫ్రికాతో పాటు భారత్ ఇతర దేశాలతో ఉన్న సఖ్యతను తెలిపారు. రోడ్స్ తో పాటు మరికొంతమంది క్రికెటర్లకు కూడా తాను లేఖ రాసినట్టు మోడీ లేఖలో పేర్కొన్నారు.
ఈ లేఖపై రోడ్స్ స్పందించాడు. ట్విట్టర్ లో రోడ్స్ స్పందిస్తూ.. ‘మీరు చూపించిన ప్రేమకు దన్యవాదాలు నరేంద్ర మోడీ గారు.. భారత్ కు వచ్చిన ప్రతిసారి నేను తెలియని ఉద్వేగానికి లోనవుతుంటాను. భారత్ తో పాటే మా కుటుంబమంతా రిపబ్లిక్ డే ను జరుపుకుంటున్నాము...’ అని రాసుకొచ్చాడు. కాగా, రోడ్స్ కు భారత్ అంటే వల్లమాలిన అభిమానం అన్న విషయం తెలిసిందే. అతడి కూతురుకు కూడా ‘ఇండియానా’ అని పేరు పెట్టాడు రోడ్స్..
భారత రిపబ్లిక్ డే సందర్భంగా ట్వీట్స్ చేస్తున్న విదేశీ క్రికెటర్ల అభిమానానికి టీమిండియా అభిమానులు ఖుషీ అవుతున్నారు. జాతీయ పండుగ అయిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు చెబుతన్నందుకు గాను వాళ్లు పులకరించిపోతున్నారు. ఇక టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లితో పాటు పలువురు ఇతర క్రికెటర్లు కూడా దేశ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.