సారాంశం

IPL 2025 PBKS vs MI: మే 11న జరగాల్సిన పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్  ఐపీఎల్ 2025 మ్యాచ్ ధర్మశాల నుంచి అహ్మదాబాద్‌కు మారింది. భార‌త్-పాక్ ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య అక్క‌డి విమానాశ్రయ మూతప‌డింది. 
 

IPL 2025 PBKS vs MI: మే 11న జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 61 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (PBKS), ముంబై ఇండియన్స్ (MI) త‌ల‌ప‌డ‌నున్నాయి. అయితే, మ్యాచ్ జ‌ర‌గాల్సిన వేదిక‌ను ధర్మశాల నుంచి అహ్మదాబాద్‌కు మార్చారు. భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సింధూర్' అనంతరం పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోని ఉగ్రస్థావరాలపై దాడులు జరగడంతో.. ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు మ‌రింత పెరిగాయి. అలాగే, ధర్మశాల విమానాశ్రయం మే 10 వరకు వాణిజ్య విమానాలకు మూసివేశారు. 

అక్క‌డి విమానాశ్ర‌యం మూత‌ప‌డ‌టంతో పాటు ప్ర‌స్తుతం నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య వేదిక‌ను మార్చారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA) కార్యదర్శి అనిల్ పటేల్ అధికారికంగా తెలిపిన‌ట్టు పీటీఐకి ధృవీకరించింది. "బీసీసీఐ మా వద్ద ఆహ్వానం తెలిపింది. మేము ఆ ఆహ్వానాన్ని స్వీకరించాం. ముంబై ఇండియన్స్ జ‌ట్టు అదే రాత్రి అహ్మదాబాద్ చేరుకుంటుంది. పంజాబ్ కింగ్స్ ప్రయాణ వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్లడవుతాయి" అని ఆయన తెలిపారు.

ధర్మశాల విమానాశ్రయం మూసివేసిన  నేపథ్యంలో, పంజాబ్ కింగ్స్-ఢిల్లీ కాపిటల్స్ జట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ కూడా మ‌రో వేదిక‌కు మార‌నుంద‌ని స‌మాచారం. చండీగఢ్ విమానాశ్రయం కూడా మూసివేయబడి ఉండటంతో మ్యాచ్ ను ఎక్క‌డ నిర్వ‌హించాల‌నే విష‌యంపై సంబంధిత వ‌ర్గాలు క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. 

బీసీసీఐ ముంబై వేదికను కూడా పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఏ జట్టుకైనా హోం అడ్వాంటేజ్ కలగకూడదనే ఉద్దేశంతో చివరికి అహ్మదాబాద్‌ను ఎంపిక చేశారు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం జ‌ర‌గ‌నుంది. 

ఈ సీజన్‌లో ధర్మశాలను హోం వేదికగా ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ మూడు మ్యాచ్‌లు షెడ్యూల్ చేశారు. మే 3న లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో గెలుపొందిన పంజాబ్, మే 8న ఢిల్లీ కాపిటల్స్, మే 11న ముంబై ఇండియన్స్‌తో తలపడాల్సి ఉంది. అయితే తాజా మార్పులతో మే 11న జరగాల్సిన ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరుగుతుంది.