Pakistan Cricket: పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంజర్ Wasim Khan రాజీనామా.. సంక్షోభంలో పాక్ క్రికెట్..
Wasim Khan: పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా పాకిస్థాన్ క్రికెట్ కు చీఫ్ గా నియమితులైనా దాని తలరాత మాత్రం మారడం లేదు. రాజా పీసీబీ చీఫ్ అయినప్పట్నుంచి ఒక్కొక్కరుగా కీలక పదవుల్లో ఉన్నవారంతా రాజీనామా బాట పడుతున్నారు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఏదీ అచ్చిరావడం లేదు. గత కొన్నేళ్లుగా స్వదేశంలో సిరీస్ లు లేక ఇబ్బందులు పడుతున్న ఆ జట్టు ఇటీవలే న్యూజిలాండ్ టీమ్ ఇచ్చిన షాకుల నుంచి కోలుకోకముందే మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్లు పాక్ క్రికెట్ బోర్డుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా వ్యవహరించిన వసీమ్ ఖాన్ తన పదవికి రాజీనామా చేశారు.
2009లో లాహోర్ టెస్టు సందర్భంగా ఉగ్రవాదులు శ్రీలంకపై దాడి చేయడంతో అప్పట్నుంచి పాక్ కు వెళ్లడానికి ఏ జట్టూ ఆసక్తి చూపడం లేదు. కాగా, చాలాకాలం తర్వాత ఇటీవలే న్యూజిలాండ్ జట్టు పాక్ పర్యటనకు వచ్చినా అదీ అర్థాంతరంగా ముగించుకుని వెళ్లిపోయింది. అయితే పాక్ లో న్యూజిలాండ్ తో పాటు ఇంగ్లండ్ షెడ్యూల్ ఖరారుకావడంలో వసీమ్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. 2009 ముష్కరుల దాడి తర్వాత చాలా దేశాల క్రికెట్ బోర్డులతో మాట్లాడి పాక్ పర్యటనకు రావాలని అభ్యర్థించారు. ఒకరకంగా ఈ పదేండ్లలో పాక్ లో క్రికెట్ ను నిలబెట్టారనడంలో కూడా సందేహం లేదు. అలాంటి వసీమ్ ఖాన్ తాజాగా తన పోస్టుకు రిజైన్ చేయడం గమనార్హం.
న్యూజిలాండ్, ఇంగ్లండ్ సిరీస్ ల రద్దు విషయం పక్కనపెడితే పీసీబీ కొత్త చీఫ్ రమీజ్ రాజాతో ఎవరికీ పొసగడం లేదని బోర్డులో టాక్ వినిపిస్తోంది. రమీజ్ రాజా నియామకం జరుగకముందే పాక్ జట్టు చీఫ్ కోచ్ మిస్బావుల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ లు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారి తర్వాత ఇప్పుడు వసీమ్ ఖాన్ కూడా రాజీనామా చేసి బోర్డు నుంచి వైదొలిగాడు. పీసీబీ కి జవసత్వాలు అందిస్తాడని ఏరికోరి మరి రమీజ్ రాజాను తీసుకొచ్చి బోర్డు పగ్గాలు అప్పగిస్తే.. ఆయన మాత్రం జట్టును సంక్షోభ ఊబిలోకి తీసుకుపోతున్నాడని పాక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వసీమ్ రాజీనామా నేపథ్యంలో పీసీబీ ఈ రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించనున్నది.