Pakistan: పాకిస్థాన్ లో క్రికెట్ పునరుద్ధరణకు ఆ దేశ క్రికెట్ బోర్డు ఎన్ని చర్యలు చేపడుతున్నా అభిమానులకు మాత్రం నప్పడం లేదు.  తమ దేశానికి విదేశాల రాక సంగతేమో గానీ స్వదేశంలోని అభిమానులే గ్రౌండ్ లోకి రావడం లేదు. 

పాకిస్థాన్ క్రికెట్ ను సంక్షోభంలోంచి గట్టెక్కిస్తాడని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తన సహచర ఆటగాడైన రమీజ్ రాజాను ఏరికోరి మరి తెచ్చుకున్నారు. రాజా.. పాక్ క్రికెట్ కు మళ్లీ పాత రోజులు తీసుకువస్తాడని ఇమ్రాన్ ఖాన్ భావించారు. అందులో భాగంగానే రమీజ్ రాజా.. పలు విప్లవాత్మక నిర్ణయాలే తీసుకుంటున్నాడు. విదేశాలతో మాట్లాడి వారిని స్వదేశంలో జరిగే సిరీస్ కు రప్పించడం (వచ్చే ఏడాది ఆస్ట్రేలియా పాక్ పర్యటనకు రానుంది).. ఆసియాలో ఏ దేశంలోనూ లేని విధంగా డ్రాప్-ఇన్ పిచ్ లను భారీ ఖర్చు (రూ. 37 కోట్లు)తో తయారుచేయించడం వంటివి చేస్తున్నాడు. కానీ ఎంత చేసి ఏం లాభం.. మ్యాచ్ చూడటానికి ప్రేక్షకులు రావాలి కదా.. స్టేడియంలో ప్రేక్షకులే లేకుంటే ఇవన్నీ చేసి మాత్రం ఏం లాభం...? 

పాకిస్థాన్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ చప్పగా సాగుతున్నది. కరాచీ వేదికగా జరుగుతున్న ఆ మ్యాచులను చూడటానికి పాక్ అభిమానులెవరూ ఆసక్తి చూపడం లేదు. 32 వేల మంది కూర్చునేలా సీటింగ్ కెపాజిటీ ఉన్న కరాచీ స్టేడియంలో నిన్న జరిగిన రెండో టీ20 చూడటానికి గట్టిగా 4 వేల మంది కూడా రాలేదు.

కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం తన ట్విట్టర్ లో స్డేడియం నిండుగా ఉన్నట్టు ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఇలా చేసిన పాక్.. తన పరువు తానే తీసుకుంది. అసలు ప్రేక్షకుల్లేక ఖాళీగా ఉన్న స్టేడియంలో ఇంత మంది ఎక్కడ్నుంచి వచ్చారబ్బా...? అని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్ లో పీసీబీ పోస్ట్ చేసిన ఫేక్ ఫోటోలకు బదులుగా అసలు ఫోటోలను షేర్ చేస్తూ పీసీబీని ఆటాడుకుంటున్నారు. 

Scroll to load tweet…

ఇక.. దీంతో పాటు వచ్చే వారం విండీస్ తో జరిగే వన్డే సిరీస్ కు కూడా ఇంతవరకు టికెట్లు అమ్ముడుపోలేదు. అసలు వాటిని బుక్ చేసుకోవడానికి కూడా ఎవరూ అంతగా ఆసక్తి చూపటం లేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. వాటిని ఫ్యాన్స్ కు ఉచితంగా అందజేయాలని నిర్ణయించుకుంది. ఇలాగైనా ప్రేక్షకులు గ్రౌండ్ కు వస్తారని ఆశించింది. 

అయితే ఈ నిర్ణయంపై పాక్ సీనియర్ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి అంతర్జాతీయ మ్యాచులని, గల్లీ క్రికెట్ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫైర్ అవుతున్నారు.

Scroll to load tweet…

ఇదే విషయమై ఆ జట్టు మాజీ సారథి వసీం అక్రం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇది చాలా ఆందోళనకరం. కరాచీ స్టేడియంలో ఇలా ప్రేక్షకులు లేకుండా మ్యాచులుజరుగడం బాధగా ఉంది. గత రెండు, మూడు నెలలుగా మన క్రికెటర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నా.. ప్రేక్షకులు స్టేడియానికి రావడం లేదంటే కారణమేంటి..? కారణం నాకు తెలుసు. కానీ అది మీ నోటి నుంచి వినాలనుకుంటున్నాను. చెప్పండి.. ప్రేక్షకులెక్కడ...?’ అని పీసీబీని నిలదీశాడు.