India's 1000th ODI: భారత్ లో క్రికెట్ దేవుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్ ను, దేశంలో క్రికెట్ ప్రయాణాన్ని వేరుగా చేసి చూడలేం. ముఖ్యంగా వన్డేలలో అయితే అది అస్సలు కుదరదు. ఎందుకంటే...
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగుబోయే వన్డేతో భారత జట్టు.. కొత్త చరిత్రకు నాంది పలుకనుంది. వెస్టిండీస్ తో ఆడబోయే తొలి వన్డే భారత్ కు వెయ్యో వన్డే.. ఈ సుదీర్ఘ ప్రయాణంలో భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ముఖ్య పాత్ర పోషించాడు. ఇప్పటివరకు భారత్ 999 వన్డేలు ఆడితే అందులో సచిన్.. 463 మ్యాచులలో పాల్గొన్నాడు. ఇక సచిన్ అరంగ్రేటం నుంచి వీడ్కోలు వరకు భారత్ మొత్తంగా 638 వన్డేలు ఆడింది. అంటే భారత వన్డే క్రికెట్ ను సచిన్ ను విడదీసి చూడలేనంతగా అతడు దేశ క్రికెట్ పై ప్రభావం చూపాడు.
భారత జట్టు అరుదైన ఘనతను చేరుకుంటున్న ఈ నేపథ్యంలో మాస్టర్ బ్లాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సచిన్.. తనకు ఎంతో ఇష్టమైన ఐదు వన్డ మ్యాచులను గురించి వెల్లడించాడు. ఈ మ్యాచులను తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోనని సచిన్ తెలిపాడు.
సచిన్ కు ఇష్టమైన ఐదు వన్డే మ్యాచులు : 2011 ప్రపంచకప్ ఫైనల్, 1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్.. 2003 వన్డే ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్.. 2008లో వీబీ సీరిస్ లో భాగంగా ఆస్ట్రేలియా తో ఆడిన రెండు ఫైనల్స్..
2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ :
2011 వన్డే ప్రపంచకప్ లో భారత్-శ్రీలంకల మధ్య ఫైనల్ జరిగింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 274 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్.. 48.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. గౌతం గంభీర్ (97) ధోని (91 నాటౌట్) ల వీరోచిత పోరాటంతో భారత్ అఖండ విజయం సాధించి 28 ఏండ్ల తర్వాత విశ్వ విజేతగా నిలిచింది.
ఈ మ్యాచులో సచిన్ బ్యాటర్ గా పెద్దగా రాణించలేదు. 14 బంతులాడి 18 పరుగులు చేశాడు. అయితే అప్పటికే ఐదు ప్రపంచకప్ లు ఆడిన సచిన్ కు విశ్వకప్ గెలవాలనే కల కలగానే మిగిలి ఉంది. కానీ అతడి సొంత స్టేడియమైన వాంఖడేలోనే భారత జట్టు ప్రపంచకప్ నెగ్గి సచిన్ కు సగర్వంగా అందజేసింది.
1998 షార్జా కప్ ఫైనల్:
షార్జా వేదికగా 1998లో ఆస్ట్రేలియాతో తలప్డ భారత్ ఆ మ్యాచుతో పాటు ట్రోఫీ కూడా నెగ్గడంలో సచిన్ కీలక పాత్ర పోషించాడు. ఈ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. షేన్ వార్న్, ఫ్లెమింగ్, కాస్ప్రోవిచ్, టామ్ మూడీ వంటి భీకర బౌలింగ్ దళమున్న ఆసీస్ బౌలర్ల ముందు భారత్ బోల్తా కొట్టడం ఖాయమనుకున్నారంతా.. కానీ సచిన్ ఆసీస్ బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. ఆ మ్యాచులో సచిన్ 131 బంతుల్లో 134 పరుగులు చేసి
భారత్ కు అపూర్వ విజయాన్ని అందించాడు.
2003 ప్రపంచకప్.. పాకిస్థాన్ తో మ్యాచ్ :
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2003 ప్రపంచకప్ లీగ్ మ్యాచులో భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడింది. సెంచూరియన్ లో జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది. సయీద్ అన్వర్ సెంచరీతో కదం తొక్కాడు. పేస్ కు సహకరించే సౌతాఫ్రికా పిచ్ లపై వసీం అక్రమ్, షోయభ్ అక్తర్, వకార్ యూనిస్, షాహిద్ అఫ్రిది, అబ్దుల్ రజాక్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్న పాక్ కు విజయం ఖాయమనుకున్నారంతా....
కానీ అక్కడున్నది మాస్టర్ బ్లాస్టర్.. వీరేంద్ర సెహ్వాగ్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన సచిన్.. ఆ మ్యాచులో పాక్ బౌలర్లపై శివతాండవం ఆడాడు. 75 బంతుల్లోనే 12 ఫోర్లు, ఒక సిక్సర్ తో 98 పరుగులు చేశాడు. రెండు పరుగులతో సెంచరీ మిస్ అయినా ఈ ఇన్నింగ్స్ మాత్రం భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ అలాగే మిగిలిపోయింది. ఈ మ్యాచులో అక్తర్ బౌలింగ్ లో సచిన్ కొట్టిన అప్పర్ కట్ సిక్సర్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు.
వీబీ సిరీస్ :
2008లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇండియా, శ్రీలంక, ఆసీస్ లు తలపడ్డ ఈ ట్రై సిరీస్ లో భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరాయి. మూడు ఫైనల్ లో రెండు మ్యాచులు గెలిచిన జట్టు విజేత. తొలి ఫైనల్ లో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 239 పరుగులు చేసింది. బదులుగా భారత్.. 45.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. సచిన్ (117 నాటౌట్) సెంచరీతో భారత్ విజయం తేలికైంది.
ఇక రెండో ఫైనల్ లో భారత్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. సచిన్ (91) సెంచరీ తృటిలో మిస్ అయింది. కానీ ఈ మ్యాచులో ప్రవీణ్ కుమార్ (4-46 ) బౌలింగ్ లో మాయ చేయడంతో భారత జట్టునే విజయం వరించింది.
ఈ ఐదు మ్యాచులంటే సచిన్ కు చాలా ఇష్టమట. ముఖ్యంగా 2003 వన్డే ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో మ్యాచును మళ్లీ ఆడాలని ఉందని సచిన్ తన మనసులో మాట చెప్పాడు.
భారత్ ఆడిన 166వ వన్డేలో సచిన్ అరంగ్రేటం చేశాడు. ఆ తర్వాత 200, 300, 400, 500, 600, 700, 800 వన్డే వరకు అతడు టీమిండియాలోనే ఉండటం గమనార్హం. భారత్ ఆడిన 804 వన్డే సచిన్ చివరి మ్యాచ్..
