క్రికెట్ అంత గొప్ప క్రీడేమీ కాదు...: వీరేంద్ర సెహ్వాగ్
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత క్రికెట్ పై సంచలన కామెంట్స్ చేశాడు. మిగతా క్రీడలతో పోలిస్తే ఇది అంత గొప్ప ఆటేమీ కాదని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ గేమ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.పెద్ద పెద్ద క్రికెట్ టోర్నమెంట్ల కంటే కామన్వెల్త్, ఒలింపిక్స్ క్రీడలు చాలా గొప్పవని అన్నాడు. ప్రపంచ దేశాలన్నీ పాల్గొనే ఇలాంటి క్రీడలకోసం సిద్దమయ్యే భారత అథ్లెట్లకు, ఆటగాళ్ళకు మాత్రం సరైన సౌకర్యాలు అందడంలేదని అన్నారు. ఈ సౌకర్యాలు మెరుగుపడితే ప్రపంచ దేశాలకు మన క్రీడాకారుల సత్తా తెలుస్తుందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
భారత దేశంలో క్రికెట్ అనేది చాలా పాపులర్ గేమ్. అందువల్లే క్రికెటర్లకు అన్ని సదుపాయాలు అందుతున్నాయి. ప్రభుత్వం కూడా వారికి ఏ లోటూ రాకుండా చూసుకుంటోంది. ఇలా క్రికెటర్లు పొందే సౌకర్యాల్లో కనీసం 10-20 శాతం కూడా అథ్లెట్లకు అందడంలేదు. పలు సందర్భాల్లో వివిధ క్రీడా విభాగాలకు చెందిన ఆటగాళ్లను కలుపుకుని వారితో మాట్లాడినపుడు నాకీ విషయం అర్థమైందని సెహ్వాగ్ వెల్లడించాడు.
కనీసం సరైన పౌష్టికాహారం అందని ఎంతో మంది పేద క్రీడాకారులు మన దేశంలో వున్నారు. వారికి సరైన దిశానిర్దేశమే కాదు మంచి పోషకాహారం కూడా లభించడంలేదు. కాబట్టి ప్రభుత్వం అలాంటివారిని గుర్తించి ప్రత్యేక వసతులను గనుక కల్పిస్తే మంచి ఫలితాలను రాబట్టవచ్చు. తద్వారా కామన్వెల్త్, ఒలిపింక్స్ వంటి క్రీడల్లో వారు రాణించి దేశ ప్రతిష్టను మరింత పెంచుతారని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
అథ్లెట్లకు మంచి కోచ్ లభిస్తే చాలు వారు రాటుదేలతారు. అలాంటి కోచ్ లను వారు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కానీ క్రికెటర్లు అలా కాదు. కోచ్ లకు కనీస గౌరవం కూడా ఇవ్వరు. ఇలా ఆటగాళ్లు, గేమ్ పరంగా చూసుకున్నా క్రికెట్ కంటే కామన్వెల్త్, ఒలిపింక్స్ క్రీడలే గొప్పవన్నది తన అభిప్రాయంగా సెహ్వాగ్ పేర్కొన్నాడు.