అబ్బే.. కోహ్లిపై ఎవరూ కంప్లైంట్ చేయలేదు.. అవన్నీ ఫేక్ ముచ్చట్లే. బీసీసీఐ ప్రతినిధి షాకింగ్ కామెంట్స్
Virat Kohli: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఇద్దరు సీనియర్ ప్లేయర్లు బీసీసీఐకి ఫిర్యాదు చేశారని గత నాలుగైదు రోజులుగా మీడియాలో కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. వీటిపై బోర్డు సభ్యుడొకరు క్లారిఫికేషన్ ఇచ్చాడు.
వచ్చే టీ20 ప్రపంచకప్ (t20 world cup) తర్వాత పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి నిష్క్రమించనున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పై జట్టులోని ఇద్దరు సీనియర్ ప్లేయర్లు బీసీసీఐ (bcci) కి కంప్లైంట్ చేశారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. డ్రెస్సింగ్ రూమ్ లో విరాట్ ప్రవర్తన బాగోలేదని, ఒకరిద్దరిపై బూతులు తిడుతూ ఇష్టమొచ్చినట్టు వ్యవహరించాడని చెబుతూ వాళ్లు బోర్డు ముందు బోరుమన్నట్టు ఆ కథనాల సారాంశం.
అయితే ఈ వ్యవహారంపై ఇటు విరాట్ గానీ ఫిర్యాదు చేసిన సభ్యులు గానీ.. ఇంతవరకు నోరు విప్పలేదు. ఆ ఫిర్యాదు చేసింది టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (ashwin) అని కొందరు.. పూజారా (pujara) లేదా రహానే (rahane) అని మరికొందరు ఎవరికి తోచినవిధంగా వాళ్లు కథనాలు అల్లుకున్నారు. ఈ రచ్చకు బీసీసీఐ ఫుల్ స్టాప్ పెట్టింది.
బోర్డు ట్రెజరీ అరుణ్ ధుమాల్ (arun dhumal) ఈ ఆరోపణలకు చెక్ పెట్టాడు. తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ..‘మీడియా ఇలాంటి పనికిమాలిన కథనాలకు అడ్డుకట్ట వేయాలి. నేను ఆన్ ది రికార్డుగా ఈ విషయం చెబుతున్నా. కోహ్లి తమతో దురుసుగా ప్రవర్తించాడని ఇంతవరకు ఏ ఒక్క భారత క్రికెటర్ కూడా మాకు రాత ద్వారా గానీ, మౌఖికంగా గానీ ఫిర్యాదు చేయలేదు. అవన్నీ నకిలీ కథనాలు’ అంటూ ఫైర్ అయ్యాడు.
అంతేగాక భారత టీ20 వరల్డ్ కప్ బృందాన్ని మార్చుతున్నారని వస్తున్న వార్తల్లో కూడా వాస్తవం లేదని అరుణ్ కుండబద్దలు కొట్టాడు. ఇలాంటి కట్టు కథలు అల్లడం ఇకనైనా మానేయాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు తమకు అలాంటి ఉద్దేశమే లేదని చెప్పుకొచ్చాడు.