గత 14 నెలల కాలంలో 21.2 సగటుతో టెస్టుల్లో పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... 20+ మార్కు సగటు కూడా అందుకోలేకపోయిన కెఎల్ రాహుల్... ఇద్దరు స్టార్ బ్యాటర్ల కంటే మెరుగ్గా మహ్మద్ షమీ బ్యాటింగ్ యావరేజ్..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో కెఎల్ రాహుల్ ఫామ్ గురించి బీభత్సమైన చర్చ నడుస్తోంది. రాహుల్‌ని పక్కనబెట్టి శుబ్‌మన్ గిల్‌ని ఆడించాల్సిందేనని మాజీ క్రికెటర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆకాశ్ చోప్రా, గౌతమ్ గంభీర్ వంటి ఒకరిద్దరు మాత్రమే రాహుల్‌కి అండగా నిలుస్తున్నారు...

అయితే 2022 జనవరి నుంచి టెస్టుల్లో టీమిండియా బ్యాటర్ల యావరేజ్ చూస్తే షాక్ అవ్వడం గ్యారెంటీ. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, గత ఏడాది కాలంలో 70.7 సగటుతో పరుగులు చేసి, టీమిండియా తరుపున అత్యధిక యావరేజ్ కలిగిన భారత బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు.

భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, 2022 నుంచి జరిగిన 7 టెస్టుల్లో 67 సగటుతో పరుగులు చేసి, రవీంద్ర జడేజా తర్వాతి స్థానంలో ఉన్నాడు. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ 2022 జనవరి నుంచి జరిగిన 8 టెస్టుల్లో 48.7 సగటుతో టెస్టుల్లో పరుగులు సాధించాడు...

పేలవ ఫామ్ కారణంగా శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన ఛతేశ్వర్ పూజారా... 6 మ్యాచుల్లో 48.2 సగటుతో పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేసిన పూజారా, రెండో ఇన్నింగ్స్‌లో తన స్టైల్‌కి విరుద్ధంగా 130 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ అందుకుని అదరగొట్టాడు...

భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, ఈ ఏడాది కాలంలో 37 సగటుతో టెస్టుల్లో బ్యాటుతో పరుగులు సాధించాడు. 2021లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన అక్షర్ పటేల్, టెస్టుల్లో 32.6 సగటుతో పరుగులు చేస్తూ దూసుకుపోతున్నాడు.. 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 సీజన్‌లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు అక్షర్ పటేల్. టెస్టుల్లో 9 లేదా 10వ స్థానాల్లో బ్యాటింగ్‌కి వచ్చే మహ్మద్ షమీ, 21.8 సగటుతో పరుగులు చేశాడు. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు షమీ...

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, గత 14 నెలల కాలంలో 21.2 సగటుతో మాత్రమే టెస్టుల్లో పరుగులు సాధించాడు. మూడేళ్లుగా విరాట్ కోహ్లీ టెస్టు సగటు 30 కూడా దాటలేదు. ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మూడేళ్ల క్రితం 54గా ఉన్న టెస్టు సగటును వరుస ఫెయిల్యూర్స్‌తో 48కి తెచ్చుకున్నాడు..

కెఎల్ రాహుల్ అయితే ఈ 14 నెలల్లో 13.6 సగటుతో పరుగులు చేసి ఘోరమైన ప్రదర్శన ఇచ్చాడు. జనవరి 2022లో జోహన్‌బర్గ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 50 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఆ తర్వాత 7 టెస్టుల్లో 25 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయాడు. టాపార్డర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ కంటే మహ్మద్ షమీ సగటు ఎక్కువగా ఉండడం టీమిండియా స్టార్లకు అవమానకరం.. 

మొదటి రెండు టెస్టుల్లో ఘోరంగా ఫెయిలైన కెఎల్ రాహుల్‌కి మూడో టెస్టులో చోటు దక్కితే సోషల్ మీడియాలో రచ్చ లేవడం గ్యారెంటీ. ఛాన్స్ వచ్చి కెఎల్ రాహుల్ మరోసారి ఫెయిల్ అయితే, ఇక అదే టెస్టుల్లో అతనికి ఆఖరి అవకాశం కావచ్చు..