Asianet News TeluguAsianet News Telugu

రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్... ఇరానీ ట్రోఫీ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి...

రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో 990 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్... మధ్యప్రదేశ్‌తో ఇరానీ కప్‌ మ్యాచ్‌కి రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్‌గా టీమిండియా ఓపెనర్... ఒకే ఏడాదిలో రెండుసార్లు ఇరానీ కప్ ట్రోఫీ.. 

Mayank Agarwal going to lead Rest of India team in Irani Cup trophy, BCCI takes cra
Author
First Published Feb 27, 2023, 3:41 PM IST

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 160 పరుగులు చేసిన తర్వాత కూడా టెస్టు టీమ్‌లో చోటు కోల్పోయాడు మయాంక్ అగర్వాల్. ఓ వైపు ఏడాదిన్నరగా టెస్టుల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న కెఎల్ రాహుల్‌కి పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్న భారత క్రికెట్ బోర్డు, టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు బాదిన మయాంక్ అగర్వాల్‌ని మాత్రం సైడ్ చేసేసింది...

రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో కర్ణాటక టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్, 9 మ్యాచుల్లో 82.50 సగటుతో 990 పరుగులు చేసి, టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ పర్ఫామెన్స్ కారణంగా ఇరానీ ట్రోఫీ 2023 టోర్నీలో రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు మయాంక్ అగర్వాల్...

గ్వాలియర్‌లోని కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో మార్చి 1 నుంచి మధ్యప్రదేశ్, రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్స్ మధ్య ఇరానీ కప్ టోర్నీ జరగనుంది. రంజీలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన మిగిలిన జట్ల ప్లేయర్లను ఓ టీమ్‌‌గా చేసి రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్‌గా, రంజీ ట్రోఫీ విజేతతో ఇరానీ కప్ జరుగుతుంటుంది. అయితే కరోనా బ్రేక్ కారణంగా 2020-21 సీజన్‌లో రంజీతో పాటు, ఇరానీ ట్రోఫీ కూడా నిర్వహించలేదు...

2021-22 సీజన్‌లో రంజీ ట్రోఫీ నిర్వహించినా, కొన్ని కారణాల వల్ల ఇరానీ ట్రోఫీ నిర్వహించడం వీలు కాలేదు. ఈసారి ఒకేసారి రెండు సీజన్లుగా ఇరానీ ట్రోఫీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. దీంతో 2021-22 సీజన్‌లో రంజీ ట్రోఫీ గెలిచిన మధ్య ప్రదేశ్ జట్టుతో రెస్ట్ ఆఫ్ ఇండియా తలబడనుంది.  ఆ తర్వాత 2022-23 రంజీ ట్రోఫీ విజేత సౌరాష్ట్ర, రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్య మరోసారి ఇరానీ కప్ టోర్నీ జరుగుతుంది..

మార్చి 1 నుంచి 2021-22 ఇరానీ కప్ టోర్నీ జరగబోతుంటే, ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన తర్వాత 2022-23 సీజన్‌కి సంబంధించిన ఇరానీ కప్ జరగనుంది. 2021-23 రంజీ ట్రోఫీ ఫైనల్‌లో మధ్యప్రదేశ్ జట్టు, ముంబైని ఓడించి టైటిల్ గెలిచింది..

వాస్తవానికి ఇండోర్‌లో ఇరానీ కప్ జరగాల్సి ఉంది. అయితే ధర్మశాలలో జరగాల్సిన ఇండియా- ఆస్ట్రేలియా మూడో టెస్టు ఇండోర్‌కి మారడంతో, ఇరానీ కప్‌ని గ్వాలియర్‌కి మార్చారు. రంజీ ట్రోఫీలో మంచి పర్ఫామెన్స్ కనబర్చిన అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ కుమార్ గరామీ, యశస్వి జైస్వాల్, బాబా ఇంద్రజిత్, యష్ ధుల్ వంటి ప్లేయర్లు రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్‌లో చోటు దక్కించుకున్నారు..

విశేషం ఏంటంటే రంజీ ట్రోఫీ 2023 విజేత సౌరాష్ట్ర టీమ్ ప్లేయర్లు హార్విక్ దేశాయ్, చేతన్ సకారియా... రెస్ట్ ఆఫ్ ఇండియా తరుపున ఆడబోతున్నారు. ఈ ఇద్దరూ ఆ తర్వాత జరిగే ఇరానీ కప్ మ్యాచ్‌లో రంజీ విజేత సౌరాష్ట్ర తరుపున రెస్ట్ ఆఫ్ ఇండియాకి ప్రత్యర్థులుగా బరిలో దిగుతారు.. 

మధ్యప్రదేశ్ టీమ్‌కి వికెట్ కీపింగ్ బ్యాటర్ హిమాన్షు మంత్రి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నారు. మధ్యప్రదేశ్ కెప్టెన్ ఆదిత్య శ్రీవాస్తవ వ్యక్తిగత కారణాలతో ఇరానీ కప్‌కి దూరంగా ఉంటున్నాడు. రజత్ పటిదార్, వెంకటేశ్ అయ్యర్, ఆవేశ్ ఖాన్ వంటి భారత ప్లేయర్లతో మధ్యప్రదేశ్ జట్టు కూడా పటిష్టంగానే కనిపిస్తోంది...

రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), సుదీప్ కుమార్ గరామీ, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, హార్విక్ దేశాయ్, ముకేశ్ కుమార్ చౌదరి, అతిత్ సేథ్, చేతన్ సకారియా, నవ్‌దీప్ సైనీ, ఉపేంద్ర యాదవ్, మయాంక్ మార్కండే, సౌరబ్ కుమార్, ఆకాశ్ దీప్, బాబా ఇంద్రజిత్, పుల్‌కిత్ నారంగ్,యష్ ధుల్

మధ్యప్రదేశ్ జట్టు: హిమాన్షు మంత్రి (కెప్టెన్), రజత్ పటిదార్, యష్ ధుబే, హర్ష్ గ్వాలి, శుభం శర్మ, వెంకటేశ్ అయ్యర్, అక్షత్ రఘువంశీ, అమన్ సోలంకి, కుమార్ కార్తీకేయ, సరన్ష్ జైన్, ఆవేశ్ ఖాన్, అంకిత్ కుష్వా, గౌరవ్ యాదవ్, అనుభవ్ అగర్వాల్, మిహిర్ హిర్వాణి

Follow Us:
Download App:
  • android
  • ios