కృనాల్ పాండ్యా సంచలన నిర్ణయం... ఆ టోర్నీలో పర్ఫామెన్స్ బాగోలేదని కెప్టెన్సీ నుంచి...
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో ఘోరంగా విఫలమైన బరోడా టీమ్... వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన..
టీమిండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకి వివాదాలు కొత్తేమీ కాదు. దేశవాళీ టోర్నీల్లో బరోడా జట్టుకి కెప్టెన్గా వ్యవహరించే కృనాల్ పాండ్యా, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 2021 టోర్నీలో తన టీమ్ ఫెయిల్ అవ్వడంతో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. జనవరిలో జరిగిన సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 2020 సీజన్ మధ్యలో కృనాల్ పాండ్యా మరణించడంతో ఆకస్మాత్తుగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు బరోడా కెప్టెన్...
దేవ్ధర్ కెప్టెన్సీలో ఒక్క ఓటమి కూడా లేకుండా సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ 2020 ఫైనల్కి చేరింది బరోడా జట్టు. అయితే ఈ సారి కృనాల్ పాండ్యా కెప్టెన్సీలో ఎలైట్ గ్రూప్ బీలో ఐదు మ్యాచులు ఆడిన బరోడా జట్టు, కేవలం ఒకే ఒక్క విజయాన్ని అందుకోగలిగింది...
దీంతో బరోడా టీమ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు కృనాల్ పాండ్యా. డిసెంబర్ 8 నుంచి విజయ్ హాజరే ట్రోఫీ 2021 టోర్నీ జరగనుంది. కృనాల్ పాండ్యా గైర్హజరీతో బరోడా జట్టుకి కెప్టెన్గా వ్యవహరించిన దేవ్ధర్కి కెప్టెన్సీ పగ్గాలు దక్కే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన తర్వాత లెక్కకు మించిన బంగారాన్ని అక్రమంగా తీసుకువస్తూ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు కృనాల్ పాండ్యా. అప్పట్లో ఈ సంఘటన పెను దుమారమే క్రియేట్ చేసింది...
ఆ తర్వాత జనవరిలో సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ 2020 సమయంలో బరోడా కెప్టెన్గా వ్యవహరించిన కృనాల్ పాండ్యా, ఆల్రౌండర్ దీపక్ హుడా మధ్య మనస్పర్థలు వచ్చాయి. బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యా తనను బూతులు తిడుతూ, అందరి ముందు అవమానించాడని బరోడా క్రికెట్ అసోసియేషన్కి ఫిర్యాదు చేశాడు దీపక్ హుడా.
అయితే కెప్టెన్పై ఇచ్చిన ఫిర్యాదును దర్యాప్తు చేసిన బరోడా క్రికెట్ అసోసియేషన్, కృనాల్ పాండ్యాపై కాకుండా దీపక్ హుడాపైనే రివర్స్లో క్రమశిక్షణారాహిత్య చర్యలు తీసుకుంది. కరోనా ప్రోటోకాల్ను పట్టించుకోకుండా, బయో బబుల్ దాటి బయటికి వెళ్లేందుకు దీపక్ హుడా ప్రయత్నించడం వల్లే కృనాల్ పాండ్యా తిట్టాడని తేల్చిన బరోడా క్రికెట్ అసోసియేషన్, జట్టు తరుపున ఆడకుండా అతనిపై ఏడాదిపాటు నిషేధం విధించింది...
ఈ సంఘటనలతో తీవ్రమైన మనస్థాపానికి గురైన దీపక్ హుడా, బరోడా క్రికెట్ బోర్డు నుంచి తప్పుకున్నాడు. తను ఇచ్చిన ఫిర్యాదుపై సరైన విచారణ చేయకుండా తనపైనే నిషేధం వేటు వేసిన బరోడా క్రికెట్ అసోసియేషన్ తరుపున ఆడలేనట్టు ప్రకటించాడు. ఈ సీజన్లో రాజస్థాన్ జట్టు తరుపున బరిలో దిగాడు దీపక్ హుడా.
‘బరోడా క్రికెట్ అసోసియేషన్ ఇంకా ఎంతమంది సత్తా ఉన్న ఆటగాళ్లను కోల్పోతుంది. దీపక్ హుడా, బరోడా క్రికెట్ను వీడడం చాలా పెద్ద నష్టం చేకూరుస్తుంది. అతను తేలిగ్గా మరో 10 ఏళ్లు క్రికెట్ ఆడేవాడు. యంగ్ టాలెంటెడ్ క్రికెటర్ను కోల్పోయారు. ఓ బరోడా క్రికెటర్గా ఇది నన్ను చాలా నిరుత్సాహపరిచింది’ అంటూ బరోడా బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్...