Asia Cup 2023 India vs Pakistan: 40 ఓవర్లు ముగిసే సమయానికి 251 పరుగులు చేసిన టీమిండియా... విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు.. 

ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. 24.1 ఓవర్లలో 147/2 స్కోరుతో రిజర్వు డే ఆటని కొనసాగించిన భారత జట్టు.. 40 ఓవర్లు ముగిసే సమయానికి 251 పరుగులు చేసింది..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఐపీఎల్ 2023 సీజన్‌లో గాయపడి, ఐదు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్, మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరాట్ కోహ్లీకి ఇది వన్డేల్లో 66వ హాఫ్ సెంచరీ కాగా 112వ 50+ స్కోరు..

2023 ఏడాదిలో 1000 అంతర్జాతీయ పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఓవరాల్‌గా ఒకే ఏడాదిలో వెయ్యికి పైగా అంతర్జాతీయ పరుగులు చేయడం విరాట్ కోహ్లీకి ఇది 12వ సారి. సచిన్ టెండూల్కర్ 16 సార్లు ఈ ఫీట్ సాధించి టాప్‌లో ఉన్నాడు..

రాహుల్ ద్రావిడ్, మహేంద్ర సింగ్ ధోనీ 11 సార్లు ఈ ఫీట్ సాధించారు. ఓవరాల్‌గా కుమార సంగర్కర 15 సార్లు, జాక్వస్ కలీస్ 14, కుమార జయవర్థనే 14, రికీ పాంటింగ్ 13 సార్లు వెయ్యికి పైగా పరుగులు చేసి విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు..

పాక్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో భారత టాపార్డర్‌ బ్యాటర్లు 20+ పరుగులు కూడా చేయలేకపోయారు. అయితే నేటి మ్యాచ్‌లో రోహిత్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 

Scroll to load tweet…

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకి రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ కలిసి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్- గిల్ జోడి.. ఒకే ఆసియా కప్ ఎడిషన్‌లో రెండు సార్లు 100+ భాగస్వామ్యం నెలకొల్పిన భారత ఓపెనింగ్ జోడిగా నిలిచింది. 

కొలంబోలో జరిగిన గత మూడు మ్యాచుల్లో సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, నేటి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేయడం విశేషం.