ప్రాక్టీస్ మ్యాచ్ కూడా గెలిపించలేకపోయిన కెఎల్ రాహుల్.. టీమిండియా ఓటమి
T20 World Cup 2022: ‘కెప్టెన్సీకి పనికిరాడు’ అన్న టీమిండియా అభిమానుల మాటలను కెఎల్ రాహుల్ పదే పదే నిజం చేస్తున్నాడు. అతడి సారథ్యంలో భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా ఓడింది.
టీ20 ప్రపంచకప్ కు ముందే వెస్టర్న్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడిన టీమిండియా ఒకదాంట్లో గెలిచి మరోదాంట్లో ఓడింది. రెండో ప్రాక్టీస్ మ్యాచ్ లో రోహిత్ శర్మను కాకుండా కెఎల్ రాహుల్ ను సారథిగా పంపంచిన టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తప్పు అని ఈ ఓపెనింగ్ బ్యాటర్ మరోసారి ప్రూవ్ చేశాడు. బ్యాటింగ్ లో మెరిసినా సారథిగా విఫలమై భారత్ కు పరాజయాన్ని అందించాడు. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత్ 36 పరుగుల తేడాతో ఓడింది.
ఈ మ్యాచ్ లో రోహిత్ ను కాదని టీమ్ మేనేజ్మెంట్ రాహుల్ ను సారథిగా నియమించింది. టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లకు ఈ మ్యాచ్ లో విశ్రాంతినిచ్చారు. రోహిత్ మ్యాచ్ ఆడినా బ్యాటింగ్ కు రాలేదు.
కాగా నేటి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టర్న్ ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఆ జట్టులో డీ షార్ట్ (52), ఎన్. హబ్సన్ (64) లు హాఫ్ పెంచరీలతో కదం తొక్కారు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు తీయగా హర్షల్ పటేల్ రెండు వికెట్ల తీశాడు. అర్ష్దీప్ సింగ్ కు ఒక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన భారత జట్టులో రిషభ్ పంత్ (9), దీపక్ హుడా (6), హార్ధిక్ పాండ్యా (17), అక్షర్ పటేల్ (2), దినేశ్ కార్తీక్ (10), హర్షల్ పటేల్ (2), అశ్విన్ (2) లు దారుణంగా విఫలమయ్యారు. కెఎల్ రాహుల్.. 55 బంతుల్లో 9 పోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. కానీ అతడి మెరుపులు భారత్ కు విజయాన్ని అందివ్వలేదు. చివరికి భారత్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఫలితంగా వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టు 36 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ జట్టులో కెల్లీ, మెకెంజీ, మోరిస్ తలా రెండు వికెట్లు తీశారు.