పొట్టి క్రికెట్ లో బంతి, బ్యాట్ కు మధ్య జరిగే సమరంలో ఎక్కువ భాగం బ్యాట్ దే ఆధిపత్యం. భారీ సిక్సర్లు, బుల్లెట్ లలో దూసుకుపోయే బౌండరీలతో బ్యాటర్లు దుమ్మరేపుతారు. కానీ ఓ జట్టు మాత్రం పది పరుగులకే ఆలౌట్ అయింది.
టీ20 క్రికెట్ అంటే ధనాధన్ ఆట. 120 బంతుల్లో వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం నిలిపితే ఆ తర్వాత ఆ జట్టు కూడా హోరాహోరి పోరాడితే వచ్చే మజానే వేరు. విజయం కోసం ఇరు జట్లూ నువ్వానేనా అన్నట్టు పోరాడితేనే ఆటకు అందం.. చూసేవారికి ఆనందం.. అలా కాకుండా బ్యాటర్లు క్రీజులోకి అలా వచ్చి ఏదో సంతకం చేసి వెళ్లినట్టుగా వెళ్తే ఎలా ఉంటుంది..? తాజాగా ఓ మ్యాచ్ ఇలా జరిగింది. ఓ జట్టు పట్టుమని పది పరుగులు చేయడానికి నానా తంటాలుపడింది. స్పెయిన్ - ఇస్లే ఆఫ్ మ్యాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఇందుకు వేదికైంది.
క్రికెట్ కు ప్రపంచమంతా క్రేజ్ తెచ్చేందుకు ఐసీసీ ఐరోపా ఖండంతో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలలో టోర్నీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే యూరప్ లోని ఇస్లే ఆఫ్ మ్యాన్ - స్పెయిన్ మధ్య ఆదివారం లా మంగా క్లబ్ వేదికగా టీ20 మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు పది పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు సున్నాకే పరిమితమయ్యారు. అత్యధిక స్కోరు 4. మొత్తంగా 8.4 ఓవర్లు ఆడిన ఇస్లే ఆఫ్ మ్యాన్.. 10 పరుగులకే ఆలౌట్ అయింది. స్పెయిన్ బౌలర్లలో మహ్మద్ కమ్రాన్ నాలుగు వికెట్లు తీయగా.. అతిఫ్ మహ్మద్ కూడా నాలుగు వికెట్లు పడగొట్టాడు. లోర్నె బర్న్స్ రెండు వికెట్లు తీశాడు.
అనంతరం స్పెయిన్.. రెండే బంతులలో విజయాన్ని అందుకుంది. ఆ జట్టు బ్యాటర్ అవైస్ అహ్మద్.. రెండు బంతుల్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఇందులో ఓ బంతి నోబాల్ కావడం విశేషం.
కాగా టీ20 క్రికెట్ లో ఇంతవరకు బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) లో అడిలైడ్ స్ట్రైకర్స్ తో జరిగిన మ్యాచ్ లో సిడ్నీ థండర్స్ అత్యల్ప స్కోరు నమోదు చేసిన విషయం తెలిసిందే. సిడ్నీ.. 15 పరుగులకే చాప చుట్టేసింది. ఇప్పుడు సిడ్నీ రికార్డును చెరిపేస్తూ ఇస్లే ఆఫ్ మ్యాన్ 10 పరుగులకే ఆలౌట్ అయింది.
